జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి : కరవీర వ్రతం ఆచరిస్తేసౌభాగ్యం కలుగుతుంది. గన్నేరుపూలతో
అమ్మవారిని పూజించాలి.
జ్యేష్ఠ శుద్ధ విదియ : ఈ రోజును సోపపదము అంటారు. శ్రాద్ధకర్మలు ఆచరించాలి.
జ్యేష్ఠ శుద్ధ తదియ : రంభావ్రతం చేయాల్సిన రోజిది. స్వర్ణ ప్రతిమ రూపంలో అరటిచెట్టువద్ద పార్వతీదేవిని పూజించి, వస్త్రదానం చేస్తే సంపద, సౌభాగ్యాలు కలుగుతాయి.
జ్యేష్ఠ శుద్ధ చవితి : పార్వతీ మాత ఉమాదేవిగా అవతారం దాల్చిన రోజిది. ఉమాదేవి ఆరాధన చేస్తే స్త్రీలకు సౌభాగ్యవృద్ధి కలుగుతుందని బ్రహ్మపురాణ వచనం.
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి : అరణ్యక గౌరీవ్రతము, వింధ్యవాసిని ఆరాధన ఆచరించిన స్త్రీలకు సౌభాగ్యం వర్ధిల్లుతుందని స్కాంద పురాణం చెబుతోంది.
జ్యేష్ఠ శుద్ధ అష్టమి : శుక్లాదేవి ఆరాధన సంపత్కరం. అష్టమి రోజున పూజచేయాలి. మరునాడు నవమి తిథినాడు ఉపవాసం చేసి తిరిగి శుక్లాదేవిని, బ్రహ్మణీదేవిని పూజించాలి.
జ్యేష్ఠ శుద్ధ దశమి: దీన్ని దశపాపహర దశమి అంటారు.సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠ జరిగిన రోజు. ఈ రోజున నదీస్నానము దానం చేస్తే దశవిధ పాపాలు నశిస్తాయని పురాణవచనం.
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి : దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు జలం కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండి, నీటి కుండ (చెంబును) బ్రాహ్మణులకు దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. రామలక్ష్మణుల బంగారు రూపును చేయించి పూజానంతరం ద్వాదశి బ్రాహ్మణులకు దానమిస్తే విష్ణుపదం కలుగుతుంది.
శుద్ధ ద్వాదశి: ఈ రోజున త్రివిక్రమ మూర్తిని పూజించాలి.
జ్యేష్ఠ పౌర్ణమి: ఏరువాక పున్నము గ్రామీణ కర్తక జీవనానికి మార్గం.దీన్ని హలకర్మ అంటే నాగలి సాగించడం కృష్ణయజుర్వేద సంహితన రెండవ అష్టం రెండవపన్నల తొమ్మిదవ అనువాకంలో "ధేన్వే వా యేతత్ చక్ర ప్రజనయతి" అనే మంత్రం ద్వారా ఏరువాకతో దున్నగా ఫలించిన ధాన్యం దండిగా వచ్చిన బియ్యాన్ని హోమం చేస్తే చూపులేని వారికి చూపు వస్తుందని నమ్మకం. ఈరోజున 5 నాగళ్లతో ఏరువాక సాగిస్తే గ్రామంలో సుభిక్షం కలుగుతుందని కృష్ణయజుర్వేదం వివరిస్తోంది. తిలపాత్రదానం, వృషభపూజ, పెట సావిత్రీవ్రతం చేస్తే సర్వపాపహరం, అశ్వమేధయాగ ఫలం. ఛత్రము, పాదరక్షలు దానమిస్తే ఆధిపత్యం కలుగుతుంది. ఇదే రోజు బల్వత్రిరాత్రి వ్రతం చేస్తే పుణ్య లోకప్రాప్తి.
బహుళ అష్టమి : ఈ రోజున త్రిలోచన పూజ చేయాలి. ఈశ్వర ఆరాధన, త్రిలోచన పూజ వల్ల శివలోక ప్రాప్తి.
బహుళ ద్వాదశి : కూర్మజయంతి. జ్యేష్ఠ బహుళ ద్వాదశి మంగళవారం మిధున లగ్నంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించాడు. కూర్మ ఆరాధన సర్వశుభాలను కలుగజేస్తుంది. విష్ణులోకప్రాప్తి పొందుతారు.
జ్యేష్ఠ అమావాస్య :జ్యేష్ఠ బహుళ అమావాస్యనాడు వట సావిత్రి వ్రతం చేయాలి. ఉపవాసముండి మఱి చెట్టు క్రింద సూర్యాస్తమయమునకు ముందు ఈ వ్రతం చేస్తే వైధవ్య దోషం పోతుంది. ఆరోగ్యల, ఐశ్వర్యం, ప్రాప్తిస్తాయి.
Comments
Post a Comment