Kapilatheertham Temple: శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం - కపిలతీర్థం

కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం, పుణ్యతీర్థం. ఈ ఆలయంలోని శివలింగం కపిల ముని ప్రతిష్టించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది.

అందుకే ఇక్కడ స్వామివారిని శ్రీ కపిలేశ్వర స్వామిగా పిలుస్తారు.

ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం.ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు.

ఈ ఆలయానికి నలువైపులా కనిపించే తిరుమల కొండలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆ కొండల మీద నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకి ప్రవహించే ఆకాశగంగను కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు.

కోనేటికి నలువైపులా మెట్లు నిర్మించి ఉండటం వలన ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కొంతమంది నేరుగా ఆకాశగంగా కిందనే పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.

ఇక కపిల తీర్థం ఆలయ చరిత్రను పరిశీలిస్తే 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.

ఈ ఆలయ ప్రాంగణంలో ముందుగా మనకు నమ్మాళ్వార్‌ అనే ఆళ్వారు గుడి దర్శనమిస్తుంది.

ఈ ఆలయంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి దేవతల ఉపాలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు.

పరమపవిత్రమైన కపిలతీర్థ క్షేత్రం నిత్య పూజలతో ధూపదీప నైవేద్యాలతో భక్త జనసందోహంతో నిత్యం కోలాహలంగా ఉంటుంది. తిరుమల దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరు తప్పకుండా కపిల తీర్థాన్ని దర్శించుకుంటారు. ఇలా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లే ఈ ఈ తీర్థానికి ఓ ప్రత్యేకత ఉంది.

కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ ముల్లోకాల్లోని సకల తీర్థాలు నాలుగు గంటలపాటు కపిల తీర్థంలోకి వచ్చి చేరుతాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. స్నానమాచరించిన తర్వాత నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, కొండంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందుకే కార్తీక మాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు.

నిత్యం ఈ తీర్థంలో పుణ్య స్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపాలు వెలిగిస్తారు. అంతేకాకుండా శివుడికి ప్రీతికరమైన ఆరుద్రా నక్షత్రం రోజున ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. మరి విశేషంగా కార్తీకంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిళ్వార్చన, అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి. ఏటా డిసెంబరులో తెప్పోత్సవాలూ, మాఘమాసంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలూ నిర్వహిస్తారు.

కపిల తీర్థంలో కార్తీక పౌర్ణమి నాడు శివుడికి ప్రత్యేకంగా అన్నాభిషేకం జరుగుతుంది. ఈ ఉత్సవం కళ్లారా చూసి కొంచెం అన్నాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఎలాంటి రోగాలైన పోతాయని, సమస్త పాపాలు నశించిపోతాయని భక్తుల విశ్వాసం.

అలాగే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఇక్కడ కామాక్షి అమ్మవారికి గంధం చీర కడతారు. అమ్మవారిని గంధం చీరలో దర్శనం చేసుకున్న వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి