Vaikunta Chaturdashi: వైకుంఠ చతుర్దశి

కార్తీక శుద్ధ చతుర్దశినే వైకుంఠ చతుర్దశి అంటారు. ఈ రోజున భక్తి ప్రపత్తులతో శ్రీహరిని ధ్యానించి నివేదనలు సమర్పిస్తే అపరిమితమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివ, విష్ణు ఆలయాల్లో దీపాలు పెడితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసమంతా దీపాలు పెట్టలేనివారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ మూడు రోజులైన దీపాలు వెలిగిస్తే పాపాలు హరించుకుపోతాయి. ఇతరులు పెట్టిన దీపాన్ని కొండెక్కకుండా చూసినవారి పాపాలుకూడా ఆ దీపాగ్నిలో కాలిపోతాయని పురాణ వచనం. కొండెక్కిన ఇతరుల దీపాలను వెలిగించినవారికీ ఎంతో పుణ్యం లభిస్తుంది.

ఈ రోజున శ్రీహరి స్వయంగా శివుడిని పూజిస్తాడని పురాణ కథనం. అందుకే ఈ రోజును అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. శివ కేశవులు వేరుగా కనిపిస్తున్నప్పటికి వారిద్దరూ ఒకటేనని వేదాలు చెబుతున్నాయి. కార్తీక శుద్ధ చతుర్దశినాడు శ్రీమహావిష్ణువుకు దీపాలను అర్పించినవారికి వైకుంఠంలో స్థానం లభిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకున్నా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేసే ప్రతి పని అక్షయమవుతుందట. అందుకని పాపాలు చేయకుండా పుణ్యాలు మాత్రమే చేయడం వలన శుభాలు కలుగుతాయని గ్రహించాలి.

ఈ రోజున శ్రీహరి వైకుంఠంనుండి నేరుగా కాశీ నగరానికి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున లింగ వ్రతం ఆచరించి జాగరణ చేసినవారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన ఈ రోజు ఇత్తడి కుందుల్లో లేక రాగి కుందుల్లో దీపాలు వెలిగించి వాటిని దానం చేయాలి. అలా చేయడం వలన దోషాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి. ఆనందంగా జీవిస్తారు.

కార్తీక చతుర్దశి గొప్పతనాన్ని వివరించడానికి పురాణ కథ ఒకటి ఉంది. పూర్వకాలంలో సరస్వతి నదీ తీరాన శిథిలమై ఉన్న విష్ణు ఆలయానికి ఒక ముని వచ్చాడు. ఆ ప్రదేశం తాను తపమాచరించడానికి అనువుగా ఉంటుందని భావించాడు. పక్క గ్రామం నుండి ప్రమిదలు, వత్తులు, నూనె తీసుకు వచ్చి దీపాలు వెలిగించి నారాయణుడిని స్తుతించి ధ్యానం చేసుకోసాగాడు. అదే రోజున ఆహారం ఎక్కడా దరకక ఆకలితో ఉన్న ఒక ఎలుక అక్కడికి వచ్చింది. కొండెక్కిన దీపంలో ఉన్న వత్తిని చూసి ఆహారంగా భావించింది. దానిని కరచుకొని వెళుతూ ఉంటే పక్కనే వెలుగుతున్న దీపానికి తాకి ఎలుక నోటిలో ఉన్న వత్తి వెలిగింది. ఆ రోజు కార్తీక చతుర్దశి కావడం, తనకు తెలియకుండానే ఆ ఎలుక ఏమీ తినకుండా ఉండడం, దీపం వెలిగించడం వలన దానికి పుణ్యం ప్రాప్తించి ఓ దివ్యమైన పురుష శరీరాన్ని దాల్చింది.

ధ్యానం ముగించిన ముని అతన్ని చూసి దివ్య దృష్టితో అతని గత జన్మను తెలుసుకున్నాడు. గత జన్మలో అతడు బహ్లికుడనే బ్రాహ్మణుడు. స్నాన సంధ్యాదులు వదిలి తినడమే పనిగా పెట్టుకున్నాడు. దాసితో వ్యభిచరించాడు. డబ్బుకోసం కూతురిని అమ్ముకున్నాడు. అలా అనేక పాపాలు చేసి కన్ను మూసాడు. ఆ పాప ఫలితంగా నరకం అనుభవించి చివరికి ఎలుకగా జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ పురుషుడు పశ్చాత్తాప పడ్డాడు. అప్పటినుండి సరస్వతీ నదిలో స్నానమాచరిస్తూ వ్రత నియమాలు పాటిస్తూ దీపాలు వెలిగిస్తూ మోక్షం పొందాడు.

కార్తీక శుద్ధ చతుర్దశినాడు భగంతుడిని ధ్యానిస్తూ స్నాన, దానాదులు పాటిస్తూ దీపాలు వెలిగిస్తే విష్ణు సాయుజ్యాన్ని పొందవచ్చని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.

2024: తేదీ: నవంబర్ 14.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి