Srivilliputhur Andal Temple: శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం - శ్రీవిల్లిపుత్తూర్

ధనుర్మాసంలో జరిగే తిరుప్పావై సందర్భంగా మహిమాన్వితమైన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. చూపరులను అబ్బురపరిచే శిల్పకళా సౌందర్యం, ఎత్తైన రాజ గోపురాలు, భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచే ఆండాళ్, రంగనాయక స్వామి విగ్రహం ఇవన్నీ ఈ ఆలయ ప్రత్యేకతలు. ఈ ఆలయంలో మరో విశేషమేమిటంటే ఇక్కడ వటపత్రశాయి శ్రీదేవి భూదేవితో కలిసి కొలువు తీరి ఉండడం. ఈ ఆలయాన్ని దర్శిస్తే అవివాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం.

ఆలయ స్థల పురాణం

నారాయణుని రాక్షస సంహారం

పూర్వం మార్కండేయ మహర్షి, భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసారంట! అప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. ఆ అరణ్యంలో ఉండే 'కాలనేమి' అనే రాక్షసుడు తరచూ మహర్షుల తపస్సుకు ఆటంకం కలిగిస్తుంటే ఆ మునులు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించారు. అప్పుడు నారాయణుడు ఆ రాక్షసులను అంతమొందించి శ్రీదేవి, భూదేవి సమేతంగా అక్కడే మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడంట! అందుకే అక్కడ స్వామికి వటపత్రశాయి అని పేరు వచ్చింది.

శ్రీవిల్లిపుత్తూర్ పేరు ఇలా వచ్చింది

రాక్షస సంహారం తర్వాత ఈ ప్రాంతాన్ని 'మల్లి' అనే రాణి పరిపాలించేది. ఆమెకు విల్లి, పుట్టన్ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. వీరిద్దరూ ఒకసారి వేట కోసం అడవికి వెళ్లిన సమయంలో పులితో పోరాడుతూ పుట్టన్ చనిపోగా విల్లి సొమ్మసిల్లి తన సోదరుని శవం పక్కనే పడిపోయాడంట! అప్పుడు విల్లికి నారాయణుడు స్వప్నంలో కనిపించి ఈ అడవి ప్రాంతాన్ని అందమైన పట్టణంగా మార్చి తనకు ఆలయం నిర్మించి మర్రిచెట్టు కింద ఉన్న ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పాడంట! అలా చెబుతూ స్వామి పుట్టన్​ను కూడా బతికించాడంట.

ఆలయ నిర్మాణం

స్వామి కలలో కనిపించి చెప్పినట్లుగా విల్లి, పుట్టన్ ఆలయం నిర్మించి శ్రీదేవి భూదేవి సమేత వట పత్రశాయిని ప్రతిష్టించారు. ఆ సోదరుల పేరుతోనే ఈ ఆలయానికి శ్రీవిల్లిపుత్తూర్ అనే పేరు వచ్చిందని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది.

స్వామి సేవలో తరించిన విష్ణుచిత్తుడు

ఈ ఆలయంలో నారాయణుని భక్తుడు విష్ణుచిత్తుడు ప్రతిరోజూ స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఆలయంలోని తులసి వనంలో ముద్దులొలికే పసిపాప దొరుకుతుంది. సంతానం లేని విష్ణుచిత్తుడు ఆ పాపను ఇంటికి తీసుకెళ్లి 'గోదా' అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు.

గోదాదేవి కృష్ణ భక్తి

గోదాదేవి శ్రీకృష్ణుని మీద భక్తి విశ్వాసాలకు కలిగినది. గోదా చిన్న వయసులోనే కృష్ణ భక్తితో అనేక పద్యాలు రాసింది. ప్రతిరోజూ కృష్ణుడి కోసం తయారు చేసిన పూలమాలలు ముందుగా ఆమె ధరించి తరువాత కృష్ణుడికి పంపేది. ఈ విషయం తెలుసుకున్న విష్ణుచిత్తుడు భగవంతుని పట్ల అపచారం జరిగిందన్న బాధతో ఆలయానికి వెళ్లడం మానుకున్నాడు.

విష్ణు చిత్తునికి స్వప్న సాక్షాత్కారం

అప్పుడు విష్ణుచిత్తుడికి కలలో స్వామి కనిపించి గోదాదేవి ధరించిన మాలలు అంటే తనకు ఇష్టమని, అవే తనకు వేయమని కోరాడు. తరువాతి కాలంలో ఆ పాప పెరిగి పెద్దయి ఆండాళ్ గా మారి, శ్రీకృష్ణుని భర్తగా పొందాలని కోరికతో 30 దివ్యమైన పాశురాలను రచించింది. ఆమె కోరికను మన్నించి కృష్ణ స్వరూపమైన శ్రీరంగంలోని రంగనాధుడు గరుడ వాహనంపై రాజు రూపంలో శ్రీవిల్లిపుత్తూర్ వచ్చి గోదాదేవిని పరిణయమాడాడు. అంతట గోదాదేవి రంగనాధునిలో ఐక్యమైనదని అంటారు. ఈ విధంగా శ్రీ విల్లిపుత్తూర్ లో గోదాదేవి రంగనాథుని సమేతంగా వెలిసిందని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తుంది.

ఎలా చేరుకోవచ్చు?

మధురై నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి చేరుకోవడానికి రైలు, బస్సు, విమాన సౌకర్యాలున్నాయి. ధనుర్మాసంలో విశేషంగా జరిగే తిరుప్పావై 30 రోజులలో కనీసం ఒక్కరోజైనా శ్రీవిల్లిపుత్తూర్ ఆలయాన్ని దర్శించుకోవడం శుభప్రదమని శ్రీ వైష్ణవ భక్తుల విశ్వాసం.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి