Magha Puranam Telugu: మాఘ పురాణం ఏడో అధ్యాయం- మాఘ స్నానం చేసి ముక్తి పొందిన బ్రహ్మరాక్షసుని కథ - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, February 4, 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం ఏడో అధ్యాయం- మాఘ స్నానం చేసి ముక్తి పొందిన బ్రహ్మరాక్షసుని కథ

శివపార్వతుల సంవాదం

పరమ శివుడు పార్వతితో "ఉమాదేవి! మాఘ మాస స్నాన మహత్యాన్ని వివరించే మరొక కథను చెబుతున్నాను శ్రద్దగా ఆలకింపుము" అని ఈ విధంగా చెప్పసాగాను.

మాఘ పురాణం ఏడో అధ్యాయం - సుశీలుడను బ్రాహ్మణుని వృత్తాంతం

పూర్వం ద్వాపర యుగంలో గోదావరి తీరమందు వేదవేదాంగాలు చదివిన సుశీలుడనే బ్రాహ్మణుడు కలడు. అతను దేశాటన చేయుచూ ఒకసారి దారితప్పి ఒక మహారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యం సూర్యకాంతి కూడా ప్రసరించనంత దట్టమైన మామిడి, మద్ది, వెలగ, దేవదారు వంటి పెద్ద పెద్ద వృక్షాలతో, దట్టమైన ముండ్ల పొదలతో నిండి ఉంది. ఆ అరణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు, అనేక రకాల విష సర్పాలు, రకరకాల పక్షులతో కూడి ఉండేది.

బ్రహ్మరాక్షసుని వృత్తాంతం

ఆ అరణ్యంలో చండ్రచెట్టు ఆకారంలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడి పాదాలు చండ్రచెట్టులో ఉండేవి. మిగిలిన శరీరమంతా రాక్షసాకారంతో ఉండేది. ఎర్రని కన్నులతో పెద్ద నోరుతో భయానకంగా ఉండే ఆ రాక్షసుడి పాదాలు చండ్రచెట్టులో ఉండడం వలన గాలి వీచినప్పుడల్లా ఆ చెట్టు ముళ్ళు వాడి కాళ్లకు గుచ్చుకొని రక్తమాంసాలు బయటకు వస్తుండేవి. తిండి నీళ్లు లేక వాడు ఆ రక్తమాంసాలనే తింటూ ఆ బాధకు కాసేపు స్పృహ తప్పుతూ కాసేపు కళ్ళు తెరుస్తూ దుర్భరమైన పరిస్థితిలో ఉండేవాడు.

బ్రహ్మరాక్షసుని వివరాలు అడిగిన సుశీలుడు

మహారణ్యంలో దారితప్పి తిరుగుతున్న సుశీలుడు బ్రహ్మ రాక్షసుని చూసి భయపడిపోయాడు. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని స్మశానమందు కానీ, వనమందు కానీ, నీటియందు కానీ, ఇంటియందు కానీ కలిగిన భయం శ్రీహరిని స్మరిస్తే పోవునని గుర్తొచ్చి మనసారా ఆ శ్రీహరిని ప్రార్థించాడు. అనంతరం ఆ రాక్షసుని వంక చూసి సుశీలుడు దయతో "ఓ రాక్షసాధమా! భయపడకుము. నీకు ఇంత బాధ కలగడానికి కారణమేమి? ఈ రాక్షస రూపం నీకు ఎలా వచ్చింది? పూర్వజన్మలో నీవేమి పాపం చేశావు? ఆ విషయమంతా నాకు వివరంగా చెప్తే నేనేమైనా నీకు సహాయం చేయగలనేమో చూద్దాం" అన్న సుశీలుని మాటలకూ రాక్షసుడు అతని వంక తీక్షణంగా చూశాడు.

సుశీలునికి తన దీనగాథ వివరించిన రాక్షసుడు

బ్రాహ్మణ దర్శనంతో రాక్షసునికి పూర్వజన్మ స్పృహ కలిగింది. అప్పుడు రాక్షసుడు సుశీలునితో "ఓ విప్రోత్తమా! నేడు నాకు మీ దర్శనం వలన పూర్వజన్మ స్మృతి కలిగింది. నేను పూర్వం గోకర్ణమునకు సమీపంలోని మధువ్రతం అనే గ్రామానికి అధికారిగా ఉండేవాడిని. ఆ గ్రామంలో అందరూ బ్రాహ్మణులే! నేను కూడా బ్రాహ్మణుడనే! కానీ నేను ఏ రోజు సంధ్యావందనం చేసి ఎరగను. ఆచారాలు పాటించలేదు. దైవారాధన విడిచి పెట్టి అధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు అసత్యం పలుకుతూ గ్రామంలోని బ్రాహ్మణుల ధనాన్ని అపహరిస్తూ ఉండేవాడిని. హరికథలు జరిగే చోట ఉండకుండా ఎప్పుడూ దుర్జనులు ఉండే ప్రదేశానికి వెళ్లి వారితో తిరుగుతూ ఉండేవాడిని. సజ్జన సాంగత్యం విడిచి దుర్జన సాంగత్యం చేసేవాడిని. నా జీవితంలో ఎవ్వరికీ ఒక్క ఉపకారం కూడా చేసి ఎరగను.

రాక్షసుని నీచ జన్మలు

నా పాపఫలితంగా మరణించిన తరువాత నేను యమలోకం చేరి ఎనిమిది యుగాలు ఎన్నో కష్టాలు అనుభవించాను. చివరకు యమదూతలు నన్ను భూలోకంలో త్రోసి వేయగా గాడిదలా, ఏనుగులా, కుక్కలా, పిల్లిలా, పందిలా, తోడేలులా ఇలా ఎన్నో జన్మలు ఎత్తి ఒక్కో జన్మలో పదివేల సంవత్సరాలు కష్టాలు అనుభవించి చివరకు ఈ రాక్షస రూపాన్ని పొందాను. నా పాదాలు చండ్రచెట్టులో ఉండడం వలన ముళ్ల బాధతో యమబాధను అనుభవిస్తున్నాను" అని రాక్షసుడు తన వృత్తాంతాన్ని సుశీలునికి వివరిస్తాడు.

రాక్షసునికి ముక్తి కలిగించాలని నిర్ణయించుకున్న సుశీలుడు

రాక్షసుని దీనగాథ విన్న తర్వాత సుశీలుడు అతనితో "రాక్షసా! నీకు గొప్ప కష్టం సంభవించింది. ఈ అరణ్యమునకు సమీపంలో ఏదైనా నదికానీ చెరువు కానీ ఉందా! ఉంటే ఆ నీటితో నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను" అనగా రాక్షసుడు ఆ సమీపంలో నీరు లేదని అంటాడు. సుశీలుడు రాక్షసుని వంశక్రమం గురించి అడుగగా రాక్షసుడు "అయ్యా! నా వంశంలో నా పుత్రులు, మనుమలు అందరూ నా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారు. వారిలో భాష్కలుడు అనే వాడు మాత్రం ఇప్పటికీ అదే గ్రామంలో ఉన్నాడు. కానీ వాని వలన నాకుముక్తి ఎలా కలుగుతుంది? అని ప్రశ్నించాడు.

బ్రహ్మరాక్షసునికి ముక్తి మార్గం చెప్పిన సుశీలుడు

అప్పుడు సుశీలుడు రాక్షసునితో దిగులు చెందకు భాష్కలునితో నీ ముక్తి కలుగుతుంది. నేను వెంటనే నీ గ్రామం పోయి భాష్కలునితో నీవు తరించే మార్గం చెబుతానని చెప్పి ఆ అరణ్యం నుంచి ఎట్లనో బయటపడి గోకర్ణానికి చేరాడు.

భాష్కలుని కలిసి తరుణోపాయం చెప్పిన సుశీలుడు

బ్రహ్మరాక్షసుని గ్రామానికి వెళ్లిన సుశీలుడు అతని వంశానికి చెందిన భాష్కలుని కలిసి అరణ్యంలో తాను చూసినదంతా వివరంగా చెప్పాడు. అనంతరం సుశీలుడు భాష్కలునితో " భాష్కలా! నీవు మాఘ మాసంలో సూర్యోదయ సమయంలో నదీస్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు విడువుము. నీ వంశంలో ఒకడు బ్రహ్మ రాక్షసుడై బాధలు పడుతున్నాడు. అతని పాప విమోచనం కోసం నీవు మాఘ స్నానం చేస్తే అతడు తరిస్తాడని" చెప్పి సుశీలుడు తన దారిన పోయెను.

భాష్కలుని మాఘ స్నానంతో ముక్తి పొందిన రాక్షసుడు

సుశీలుడు చెప్పినట్లుగానే భాష్కలుడు మాఘ మాసం రాగానే మాఘ స్నానం చేసి పితృ తర్పణాలు విడిచాడు. మాఘ మాసమంతా భాష్కలుడు నియమ నిష్టలతో మాఘ వ్రతాన్ని ఆచరించాడు. తత్పుణ్య ఫలంగా బ్రహ్మరాక్షసుడు ముక్తిని పొందాడు. చండ్ర చెట్టు నేల మీద పడిపోయింది. రాక్షసుడు తన రాక్షస రూపాన్ని విడిచి దివ్య శరీరం ధరించి స్వర్గలోకమునకు చేరెను. శివుడు పార్వతికి ఈ కథను వివరించి "పార్వతి! చూశావుగా! మాఘ స్నానంతో మరణించిన పితృదేవతలకు సద్గతులు ఎలా కలుగుతాయో అని చెబుతూ శివుడు ఏడో రోజు కథను ముగించాడు.

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! సప్తమాధ్యాయ సమాప్తః

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages