Ballaleshwar Pali Ganesh Temple: బల్లాలేశ్వర్ వినాయక ఆలయం

మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్ర దర్శనంలో భాగంగా మూడవ క్షేత్రం బల్లాలేశ్వర్ క్షేతంలో వినాయకుడు ఆపద్భాంధవుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ స్వామిని దర్శిస్తే ఎంతటి కష్టమైనా, ఎలాంటి ఆపదలైన తొలగిపోతాయని విశ్వాసం.

ఈ క్షేత్రం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో రోహా నుండి 28 కి.మీ దూరంలో ఉన్న పాలీ గ్రామంలో ఉంది. ఇది సరస్‌గడ్ కోట అంబా నదికి మధ్యలో ఉంది.

1640లో మోరేశ్వర్ విఠల్ సింద్కర్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. 'శ్రీ' అనే అక్షరం ఆకారంలో ఈ ఆలయంలో నిర్మించారు. ఉదయాన్నే సూర్యుని కిరణాలు నేరుగా గణపతి విగ్రహంపై ప్రసరించడం గొప్ప విశేషం. ఈ ఆలయంలో వినాయకుడు రాతి సింహాసనంపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.

పాలీ గ్రామాన్ని పూర్వం 'పల్లిపుర్' అనేవారు. ఈ గ్రామానికి చెందిన కల్యాణ్ అనే వ్యాపారస్థుని కుమారుని పేరు 'బల్లాల్'. చిన్న వయసు నుంచి గొప్ప వినాయక భక్తుడు. బల్లాల్ ప్రతిరోజూ స్నేహితులతో కలిసి అడవికి వెళ్లి అక్కడున్న చిన్న చిన్న రాళ్లనే వినాయకుని మూర్తులుగా భావించి పూజిస్తూ ఉండేవారు. ఆ పసిపిల్లలు పూజలే తమ ఆటలుగా ఆ అడవిలో అమాయకమైన భక్తితో వినాయకుని ఆరాధిస్తూ ఉండేవారు. ఒకరోజు వారికి ఒక పెద్ద రాయి దొరికింది. బల్లాల్ ఆ రాతిని నిజమైన వినాయకుడిగా భావించి భక్తితో పూజలు చేయడం మొదలు పెట్టాడు. ఆ నిర్మలమైన భక్తి పారవశ్యంలో వారు రాత్రి అయింది కూడా గమనించలేదు.

ఇలా ఆ పిల్లలు రాళ్లను, రప్పలను వినాయకులంటూ పూజిస్తూ ఆ ధ్యాసలో ఇల్లు పట్టకుండా అడవిలోనే పొద్దు పోయేవరకు ఉండి రాత్రి సమయంలో ఇల్లు చేరుతుండేవారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహించి ఇలా రాత్రి వరకు అడవుల్లో ఉండటానికి కారణం బల్లాల్ అని అతని తండ్రి కల్యాణ్​కు ఫిర్యాదు చేసారు. కల్యాణ్​ సహజంగానే ఆ ఊర్లో పెద్ద పేరున్న సేఠ్. తన కుమారుని వల్ల కల్యాణ్​కు చెడ్డ పేరు రావడం భరించలేక పోయాడు. కోపంతో కల్యాణ్​ సేఠ్ తన కుమారుడని కూడా చూడకుండా అడవికి తీసుకుని వెళ్లి, చెట్టుకి కట్టి స్పృహ తప్పేలా కొడతాడు. బల్లాల్ గణపతిగా భావించి పూజిస్తున్న రాతివిగ్రహాన్ని నేలకేసి విసిరికొట్టి ముక్కలు చేస్తాడు. 'ఏ దేవుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో చూస్తాను' అంటూ ఆ అడవిలోనే అలా వదిలేసి వెళ్ళిపోతాడు.

తనను కొట్టినందుకు కాకుండా గణేశుని అవమానించినందుకు బల్లాల్​కు తన తండ్రి మీద విపరీతమైన కోపం వస్తుంది. గణేశుడిని అవమానించినందుకు అంధుడు, చెవిటి, మూగ మరియు మూగవాడు అవుతాడని బల్లాల్ తన తండ్రిని శపించాడు. దెబ్బల నొప్పికి, ఆకలి, దాహంతో బల్లాల్ బాగా నిరసించిపోయాడు. మూర్ఛపోయే వరకు గణేశ నామాన్ని జపిస్తూనే ఉంటాడు. ఆ సమయంలో వినాయకుడు ఒక సాధువు రూపంలో వచ్చి బల్లాల్ కట్లు విప్పి విడిపించి, ఊరడిస్తాడు. సాధువు స్పర్శతో బల్లాల్ గాయాలన్నీ నయమైపోతాయి. బల్లాల్ సాధువు ముందు సాష్టాంగపడి, వినాయకుడిగా గుర్తించి పూజించాడు. అప్పుడు వినాయకుడు నిజ రూపంలో ప్రత్యక్షమైన ఏ వరం కావాలో కోరుకోమంటాడు.

అప్పుడు బల్లాల్ 'మా తండ్రి నేలకు కొట్టిన రాతిలోనే నువ్వు ఉండాలని' కోరుకున్నాడు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గణేశుడు స్థిర నివాసం ఏర్పరచుకొని తనను ఆశ్రయించే ప్రజల కష్టాలను, ఆపదలను తొలగించాలని కోరుకుంటాడు. బల్లాల్ అమాయకమైన భక్తి విశ్వాసాలకు ముగ్ధుడైన గణపతి ఇకనుంచి తన పేరుకు ముందు బల్లాల్ కలిపి బల్లాలేశ్వర్గా ఇక్కడే వెలుస్తానని చెప్పి వినాయకుడు ఆ రాతి విగ్రహంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న విగ్రహం అదే.

ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. ఈ ఆలయం వెనుక దుండి వినాయకుని విగ్రహం ఉంటుంది. అదే బల్లాల్ తండ్రి విసిరిపారేసిన రాతి వినాయకవిగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుని దర్శించాకే ప్రధాన ఆలయంలోని వినాయకుని దర్శిస్తారు. బల్లాల్ కోరిక మేరకు వెలిసిన ఈ వినాయకుని 'బల్లాలేశ్వర్' అని పిలుస్తారు.

No comments