Ashtadasa Shakti Peethas: అష్టాదశ శక్తిపీఠాలు

అష్టాదశ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. సతీ దేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని  పురాణాల్లో ఉంది. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాలు అత్యంత విశిష్ఠమైనవని.

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయాలనుకుని అందర్నీ ఆహ్వానిస్తాడు. కానీ తనకు నచ్చని శివుడిని పెళ్లిచేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని , అల్లుడిని పిలవడు. అయితే పుట్టింటి వాళ్లు ప్రత్యేకంగా పిలవాలా ఏంటనే ఆలోచనతో ప్రమథగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్లిన సతీదేవి అవమానానికి గురవుతుంది. తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది. ఆగ్రహంతో ఊగిపోయిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగంతో ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకుని తన జగద్రక్షణాకార్యాన్ని పక్కనపెట్టేశాడు. దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి..శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా చెబుతారు.


లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగుళాంబా, శ్రీశైలే భ్రమరాంబికా

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారణాస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్

సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్


అష్టాదశ శక్తిపీఠాలివే

1.శాంకరి - శ్రీలంక

ఈ శక్తిపీఠం తూర్పుతీరంలో  ట్రిన్‌కోమలీలో ఉండొచ్చుని చెబుతారు. 17వ శతాబ్దంలో  పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందని ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందని చెబుతారు. 

2. కామాక్షి - కాంచీపురం

కామాక్షీ దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడు ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడింది

3. శృంఖల - ప్రద్యుమ్ననగరం

కోల్ కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడి వారు చోటిల్లామాత గా పూజిస్తారు. కోల్ కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా చెబుతారు.

4. చాముండి - క్రౌంచ పట్టణం 

ఈ ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై, కర్ణాటకలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి కురులు ఊడి ఈపర్వతాలపై పడ్డాయని స్థల పురాణం

5. జోగులాంబ-అలంపూర్

మన రాష్ట్రంలో వెలసిన నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం.ఇది తెలంగాణ రాష్టం అలంపూర్ లో ఉంది. సతీదేవి పైవరుస దంతాలు, దవడ భాగం పడిందని కథనం

6. భ్రమరాంబిక - శ్రీశైలం

సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం.ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడే పరమేశ్వరుని ద్వాదశ జోతిర్లింగ క్షేత్రంకూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

7. మహాలక్ష్మి - కొల్హాపూర్

ఆది పరాశక్తి ‘అంబాబాయి'గా కొల్హాపూర్, మహారాష్ట్ర వెలసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు.

8. ఏకవీరిక - మాహుర్యం

మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో, మాహుర్ క్షేత్రంలో వెలిసింది ఏకవీరికాదేవి.సతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల నుంచి పూజలందుకుంటోంది.

9. మహాంకాళి - ఉజ్జయిని

మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవీ భాగవతంలో ఉంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళీ రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి.

10.పురుహూతిక - పిఠాపురం

ఈ పుణ్యక్షేత్రం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠబాగం పడిన చోటు కాబట్టి, ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందంటారు.

11. గిరిజ - ఒడిశా

ఒడిశా, జాజ్‌పూర్ లో వెలసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. 

12. మాణిక్యాంబ -ద్రాక్షారామం

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ద్రాక్షారామంలో సతీ దేవి ఎడమ చెంప భాగం పడింది. దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామక్షేత్రాల్లో ఒకటి.

13. కామరూప- గౌహతి

అసోం రాజధానికి గువాహటిలోని నీలచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థలపురాణం.

14. మాధవేశ్వరి -ప్రయాగ

అమ్మవారి కుడిచేతి వేళ్ళు ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రం ఉండదు. నాలుగు దిక్కులా సమానంగా కట్టన పీఠం మాత్రం ఉంటుంది.

15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు..ఏడుజ్వాలలు నిరంతరం వెలుగుతుంటాయి.ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు.

16. మంగళ గౌరి - గయ

బీహార్ లోని గయా ప్రాంతంలో సతీదేవి స్తనాలు పడినట్టు చెబుతారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవి. ఈ స్థలపురాణానికి తగినట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు.

17.విశాలాక్షి - వారణాసి

సతీదేవి మణికర్ణిక (చెవి భాగం)వారణాసిలో పడిందని స్థలపురాణం.

18.సరస్వతి - జమ్ముకాశ్మీర్

అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.

No comments