Snana Purnima: స్నాన పూర్ణిమ
జ్యేష్ట పౌర్ణమి తిథి సందర్భంగా పూరీ జగన్నాథునికి వార్షిక స్నానోత్సవం జరుగతుంది. ఈ తిథి ఈ సంవత్సరం జూన్ 11 వ తేదీన వస్తుంది. రథయాత్రకు ముందు జరిగే ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ మందిరం రత్న వేదిక నుంచి మూల విరాట్లు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు) ఒక్కోక్కటిగా బహిరంగ స్నాన మండపానికి తరలిస్తారు. దీనినే పొహండి కార్యక్రమం అంటారు. ఇది రెండురోజులపాటు జరుగుతుంది.
మూల విరాట్లకు 108 కలశాలతో సుగంధ జలాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం గజానన అలంకారంతో ముస్తాబు చేస్తారు. అశేష భక్త జనానికి బహిరంగ వేదికపై దర్శనం ఇవ్వడం స్నానోత్సవ విశిష్టత. మహా రాష్ట్ర నుంచి 15వ శతాబ్దంలో విచ్చేసిన గణపతి భక్తుని అభీష్టం మేరకు ఏటా స్వామి గజానన అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నట్లు పండితులు చెబుతారు. అనంతరం తిరుగు పొహండి స్నాన మండపం నుంచి శ్రీ మందిరం లోనికి మూల విరాట్లను తరలిస్తారు.
శ్రీజగన్నాథునికి జరిగే సేవలు పరిశీలిస్తే కొంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. స్వామివారికి జరిగే కొన్ని క్రతువులు సామాన్య మానవులకు జరిగినట్టుగానే నిర్వహిస్తుంటారు. జగన్నాథుడు యాత్ర ప్రియుడు. ఈ యాత్రకు ముందు భారీగా స్నానం ఆచరించడంతో శారీరక పరిస్థితి అదుపు తప్పుతుంది. చీకటి మండపానికి తరలి వెళ్లి తెర చాటున గోప్య సేవల్ని అందుకుని నిత్య యవ్వన రూపంతో పక్షం రోజుల తర్వాత ప్రత్యక్షమవుతాడు. ఏటా నిర్వహించే స్నానోత్సవం అందరిని ఆశ్చర్యచకితులను చేసే అంశం.
శ్రీ మందిరం రత్న వేదికపై రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథుని మూల విరాట్ దర్శనం పక్షం రోజులపాటు కనుమరుగవుతుంది. ప్రతినిధి దేవుళ్ల చిత్ర పటాలు భక్తులకు దర్శనమిస్తాయి. స్నానోత్సవం చేసుకున్న స్వామి చీకటి మండపానికి తరలివెళ్తాడు. పక్షం రోజులు ఈ మండపంలోనే సేవాదులు నిర్వహిస్తారు. మూలిక ఔషధాలు, తైల మర్దన, పత్యపు నైవేద్యాలు, కషాయం సేవన వంటి ఉపచారాలతో స్వామి తెర చాటున 15 రోజులపాటు భక్తులకు దూరంగా ఉంటాడు. పండ్లు, తేలికపాటి పొడి పదార్థాల్ని స్వామికి పక్షం రోజులపాటు నిరవధికంగా నివేదిస్తారు. అధిక స్నానం వలన స్వామివారికి జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చాయని, ఈ ఉపచారాల వలన వాటినుండి స్వామివారికి ఉపశమనం కలుగుతుందని విశ్వసిస్తారు.
ఈ కార్యక్రమం మానవాళిని చైతన్య పరిచేందుకే ఈ ఉత్సవం నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు. స్వామి స్నానోత్సవం తర్వాత వానా కాలం పుంజుకుంటుంది. ఈ వానల్లో తడిస్తే సామాన్య మానవుని పీడించే జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల్ని జగన్నాథుని గోప్య సేవలు, ప్రత్యేక నైవేద్యాలు మానవాళికి సూచిస్తాయి.
జ్వరంతో నలిగిన శరీరానికి పత్యపు ఆహార సేవనం కొత్త యవ్వనం ప్రదానం చేస్తుందనే స్పృహను జగన్నాథుని స్నానోత్సవ ఘట్టం చివరి అంకం స్పష్టం చేస్తుంది. విశ్వవ్యాప్త భక్త జనం కంటిలో పడకుండా కట్టుదిట్టంగా ఆరోగ్య నియమాలను పాటించిన జగన్నాథుడు 15 రోజులయ్యేసరికి నవ యవ్వనుడుగా ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రత్యక్ష దర్శనమే నవ యవ్వన ఉత్సవంగా రథయాత్ర ముందు రోజు ఈ వేడుక నిర్వహిస్తారు.
ఆరోగ్యమే మహా భాగ్యం అనే సందేశం జగన్నాథుని స్నానోత్సవం వెళ్లడిస్తుంది. ప్రధాన దేవాలయం రత్న వేదికపై చతుర్థా దారు (కలప) మూర్తులు నిత్యం ధూప దీపాదుల సేవలతో మసకబారుతాయి. వన్నె తగ్గుతాయి. సందర్భోచితంగా స్నానాదులు ఆచరించి నిత్యం తేజోవంతంగా వెలుగొందే విధి విధానాలు ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు. మహా స్నానం పురస్కరించుకుని భారీ దారు విగ్రహాలు సుభాషిత జలంతో శుభ్రమవుతాయి.
శ్రీ మందిరం పరిసరాల్లో దశాబ్దాలుగా నెలకొల్పివున్న మఠాలు జగన్నాథ స్వామికి సేవలు చేయడం అదృష్టంగా భావిస్తాయి. ఆ మఠాలు స్వామివారికి ఉత్సవాల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఆలయ సంప్రదాయాల ప్రకారం రాఘవ దాసు మఠం, గోపాల తీర్థ మఠం స్వామి స్నానోత్సవానికి అవసరమైన సరుకులను అందజేస్తాయి.
2025: జూన్ 11.
Comments
Post a Comment