Yogini Ekadasi: యోగిని ఏకాదశి
- జ్యేష్ట బహుళ ఏకాదశికే యోగిని ఏకాదశి అని పేరు.
- ఈ ఏకాదశి మహిమ బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది.
- ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరించాడు.
- ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది.
- భయాలు తొలగిపోయి దైర్యం సిద్ధిస్తుంది.
- కొన్ని వేలమంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలం కేవలం ఈ యోగిని ఏకాదశి వ్రతం వలన కలుగుతుంది.
- ఇది మనిషి యొక్క సమస్తపాపాలను నశింపచేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది.
యోగిని ఏకాదశి మహిళ పురుష భేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఆచరించవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వ్రతం ఆచరించడం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని శాస్త్రవచనం.
యోగిని ఏకాదశి పూజా విధానం
యోగిని ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే తలారా స్నానం చేసి శుచియై పూజా మందిరం శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణుల విగ్రహాలకు కానీ చిత్రపటాలకు కానీ గంధం కుంకుమలతో బొట్లు పెట్టి సుందరంగా అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. చామంతి, గులాబీ, మల్లెపూలతో లక్ష్మీనారాయణులను అర్చించాలి. ఏకాదశి పూజలో ముఖ్యంగా తులసి దళాలను సమర్పించాలి. తులసి లేని పూజ అసంపూర్ణం అవుతుంది. ఆవు నేతితో చేసిన చక్కెర పొంగలి ప్రసాదాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. వ్రతం చేసేవారు ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఆరోగ్య కారణాలతో ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు.
దేవాలయంలో
ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత సమీపంలోని విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. పూజ పూర్తయ్యాక యోగిని ఏకాదశి వ్రతకథను కూడా తప్పకుండా చదువుకోవాలి.
సాయంత్రం పూజ
సాయంత్రం స్నానం చేసి ఇంట్లో దేవుని ముందు దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే ఎంతో ఫలప్రదం. ఉండగలిగిన వారు ఈ రోజు జాగారం చేస్తే కూడా పుణ్యం. అయితే జాగారం చేసేవారు భగవంతుని కీర్తనలతో, భాగవత కథలతో సత్కాలక్షేపం చేయాలి. ప్రాపంచిక విషయాల జోలికి వెళ్ళకూడదు.
ద్వాదశి పారణ
మరుసటి రోజు ఉదయం ఉదయం ద్వాదశి ఘడియలు రాగానే అభ్యంగ స్నానం చేసి లక్ష్మీనారాయణుల పూజ యధావిధిగా చేసి మహా నైవేద్యం సమర్పించి నమస్కరించుకోవాలి. ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సంతృప్తి పరచి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత ఉపవాసం ఉన్నవారు భోజనం చేసి ఏకాదశి వ్రతాన్ని విరమించవచ్చు.
ఈ దానాలు శ్రేష్టం
యోగిని ఏకాదశి రోజు పేదలకు అన్నదానం చేస్తే నారాయణుడు సంతృప్తి చెందుతాడని శాస్త్రవచనం. అలాగే ఈ రోజు నెయ్యి దానం చేయడం శుభకరమని భావిస్తారు. అలాగే బ్రాహ్మణులకు గోదానం, భూదానం చేయడం కూడా కుటుంబ శ్రేయస్సును కలిగిస్తుందని పురాణం వచనం.
ఈ నియమాలు తప్పనిసరి
యోగిని ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మద్యమాంసాలు తీసుకోకూడదు. ఉల్లి వెల్లుల్లి వంటి నిషిద్ధ ఆహరం తీసుకోకూడదు. బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి.
నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతోకాలంగా పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.
2025: జూన్ 21.
Comments
Post a Comment