Kolhapur Mahalaxmi Temple: శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం - కొల్హాపూర్
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లోని ఒక శక్తి పీఠం.
ఒకనాడు పాలసముద్రంలో విష్ణుమూర్తి శేషతల్పంపై శయనించి ఉండగా, శ్రీలక్ష్మి నారాయణుని పాదసేవ చేస్తోంది. ఆ సమయంలో భృగు మహర్షి వచ్చాడు. ఈ మహర్షికి అరికాలిలో కన్ను ఉంటుంది. ఇతనికి తాను అందరికంటే గొప్పవాడినని అహంకారం ఎక్కువ. పరధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి రాకను గుర్తించలేదు. అందుకు ఆగ్రహించిన మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన పాదాన్ని ఉంచాడు. శ్రీమహావిష్ణువు వక్షస్థలం లక్ష్మీస్థానం అన్న సంగతి తెలిసిందే కదా! తన నివాస ప్రదేశాన్ని భృగు మహర్షి అవమానించడాన్ని కోపంతో అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకాన్నిచేరుకుంటుంది.
భృగు మహర్షి గర్వాన్ని అణిచిన విష్ణువు
తన వక్షస్థలంపై పాదంతో తన్నిన భృగు మహర్షిని శాంతింపజేయడానికి విష్ణువు ఆయనకు పాదసేవ చేస్తున్నట్లుగా నటిస్తూ ఋషి అరికాలిలో ఉన్న కన్ను నలిపివేసి మహర్షి గర్వాన్ని అణిచివేస్తాడు.
వైకుంఠాన్ని వీడి భూలోకం చేరిన లక్ష్మీదేవి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్లో వెలిసిందని విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పంచగంగ నది ఒడ్డున వున్నది. ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా భాసిల్లుతోంది. స్కాంద పురాణం, దేవీ భాగవతంలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు.
అవిముక్త క్షేత్రం
కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు. అవిముక్త క్షేత్రం అంటే ఎన్నటికీ విడువలేనిది అని అర్థం. ఎలాగైతే పరమశివునికి కాశీపట్నం అవిముక్త క్షేత్రంగా ఉందో అలాగే శ్రీమహాలక్ష్మికి కొల్హాపూర్ అవిముక్త క్షేత్రంగా పేరొందింది. అంటే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి అమ్మవారు ఎన్నటికీ వెళ్ళదు అని అర్ధం.
కరవీర మహాలక్ష్మి
కొల్హాపూర్లో అమ్మవారికి కరవీర మహాలక్ష్మి అని కూడా పేరుంది. ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించిందని అందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని అంటారు.
శ్రీచక్ర ప్రతిష్ఠ
నడిచే దైవంగా పేరొందిన ఆది గురువు భగవత్ శ్రీ శంకరాచార్యులవారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీ చక్రాన్ని స్థాపించినట్లుగా తెలుస్తోంది. తర్వాత విద్యాశంకర భారతి ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని గుర్తించి ఇక్కడ ఒక మఠం నిర్మించారు. గురు దత్తాత్రేయుడు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేస్తారని ప్రతీతి. అందుకు చిహ్నంగా ఇక్కడ దత్తాత్రేయుని ఉపాలయం ఉంది.
ఆలయ విశేషాలు
సుమారు 6 వేల సంవత్సరాల క్రితంకు చెందిన ఈ ఆలయం విశాల ప్రాంగణంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చూపరులను ఆకట్టుకుంటుంది. 5 గోపురాల కింద నిర్మించిన ఈ ఆలయంలో మధ్యలో ఒక గోపురం, నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు ఉంటాయి. తూర్పు గోపురం కింద మహలక్ష్మి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహా సరస్వతి కొలువుతీరి ఉన్నారు. ఇక ఉపాలయాలలో వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జాభవానిలను దర్శించుకోవచ్చు.
కమనీయం అమ్మవారి రూపం
గర్భాలయంలో అమ్మవారి స్వరూపం సుందరంగా ఉంటుంది. సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. చతుర్భుజాలతో, సింహ వాహినిగా అమ్మవారు దర్శనమిచ్చే ఈ ఆలయంలో ఏడాదికి మూడు సార్లు సూర్యుని కిరణాలు నేరుగా అమ్మవారి ముఖంపై ప్రసరిస్తాయి. ఈ సమయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. గర్భగుడి గోడపై శ్రీ చక్రం ఉండటం ఇక్కడ ప్రత్యేకం.
ఆలయంలో పూజలు, ఉత్సవాలు
కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజూ అయిదు సార్లు అర్చనలు, హారతులు జరుగుతాయి. ప్రతి శుక్రవారం విశేష పూజలు జరుగుతాయి. ఇక వసంత నవ రాత్రులలో, శ్రావణమాసంలో, దేవి నవరాత్రులలో కూడా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.
పిలిస్తే పలికే దేవతగా భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్న కొల్హాపూర్ మహాలక్ష్మిదేవిని జీవితంలో ఒక్కసారి దర్శించినా ఆ వంశంలో పది తరాల వరకు ఎవరికీ దారిద్య్ర బాధలుండవని శాస్త్ర వచనం.
Comments
Post a Comment