Eruvaka Punnami: ఏరువాక పున్నమి
జ్యేష్ఠపౌర్ణమి ఏరువాక పున్నమిగా చెప్పబడుతోంది. ఈ ఏరువాక పున్నమి పూర్తిగా రైతుల పండుగ. ఈనాడు రైతులు ఉదయాన్నే ఎద్దులను కడిగి, వాటి కొమ్ములకు రంగులను పూసి వాటిని గంటలు, గజ్జెలతో అలంకరింప జేస్తారు. తరువాత ఎద్దులను కట్టివేసే గాడిని ధూప, దీప, నివేదనలతో పూజించి, ఎద్దులకు పొంగలిని పెడతారు.
ఈనాటి సాయంకాలం నాగలిని ఎర్రమట్టి పట్టెలతో అలంకరించి, ఎద్దులను ఊరేగింపుగా పొలం వద్దకు తీసుకొని వెళ్ళి, దుక్కిని అంటే పొలం దున్నటాన్ని ప్రారంభిస్తారు.
పొలం దున్నటానికి వెళ్ళేముందు ఊరి వాకిలిలో గోగునారతో చేసిన తోరణాన్ని కట్టి, దానిని చేరుకోలలతో కొడుతూ, ఎవరికి దొరికినంత నారపీచును వారు తీసుకుంటారు. ఈ విధంగా చేయటంవల్ల పశువులకు మేలు కలుగుతుందని రైతులు నమ్ముతారు.
కాగా ఈ వ్యవసాయ ప్రారంభ పండుగను గురించి వ్రత గ్రంథాలలో చెప్పకపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే వేదకాలంలోనే ఈ రైతుల పండుగ ఆచరణలో వుండేదని చెప్పేందుకు కొద్ది పాటి ఆధారాలున్నాయి. వర్ష ఋతువు ప్రారంభమైన వెంటనే పూజాదికాలతో రైతులు దుక్కిని ప్రారంభించేవారని ఋగ్వేదం చెబుతోంది. విష్ణుపురాణంలో కూడా ఈ రైతుల పండుగ సీతయజ్ఞంపేర పిలువబడేదని పేర్కొంటోంది.
జ్యేష్ఠపౌర్ణమినాడే ఏరువాకను ఆచరించడంలో గొప్ప జ్యోతిషాంశం కూడా యిమిడి వుంది.
పారస్కరుని గృహ్య సూత్రాలలో దుక్కిదున్నటాన్ని ప్రారంభించేందుకు జ్యేష్ఠ, స్వాతి నక్షత్రాలు మంచివని చెప్పబడ్డాయి. అదే విధంగా మంచి పనులను ప్రారంభించేందుకు పౌర్ణమిని మంచి తిథిగా పేర్కొంటారు. జ్యేష్ఠమాసంలో పౌర్ణమి రోజున జ్యేష్ఠా నక్షత్రం వుంటుంది. కాబట్టే మన పూర్వీకులు ఈ పౌర్ణమిని ఏరువాక పూర్ణిమగా గుర్తించారని ఊహించవచ్చు.
ఇంకా ఈ జ్యేష్ఠ పౌర్ణమికి మహాజ్యేష్ఠ అనే పేరు కూడా వుంది. ఈ పౌర్ణమి రోజున పద్మపురాణ ప్రతిని దానం చేయడంవల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుంది. ఈ రోజున కృష్ణాజినాన్ని దానం చేయడం కూడా ఎంతో పుణ్యప్రదం. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున నువ్వులను దానం చేసే సంప్రదాయం కూడా ఉంది.
2025: జూన్ 11.
Comments
Post a Comment