Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 11 వ అధ్యాయం

శ్రుతకీర్తి మహారాజుకు శ్రుతదేవ మహాముని వివరించిన మన్మధుని పూర్వజన్మ వృత్తాంతం వైశాఖ పురాణం పదకొండో అధ్యాయంలో భాగంగా ఈ కథనంలో నారద అంబరీషుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.

నారద అంబరీషుల సంవాదం

నారద మహర్షి అంబరీషునితో వైశాఖ మహత్యంను వివరిస్తూ మిథిలాధిపతి శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవునితో 'ఓ మహర్షి! శివుని నేత్రాగ్నికి దహించుకుపోయిన మన్మధుని పూర్వజన్మ ఎట్టిది? ఏ పాపఫలంగా మన్మధునికి ఇటువంటి ఆపద కలిగింది? అని ప్రశ్నించగా శ్రుతదేవ మహాముని చెప్పిన మన్మధుని వృత్తాంతం నారద అంబరీషుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం

శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మహామునుల సంవాదం

శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తితో "ఓ రాజా! కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము" అంటూ ఇట్లు చెప్పసాగెను.

రతీదేవి దుఃఖం

శివుని నేత్రాగ్నికి భస్మమై బూడిద రాశిగా మారిన మన్మధుని చూసి రతీదేవి దుఃఖంతో మూర్ఛపోయింది. కొంచెం సేపటికి స్పృహలోకి వచ్చి భస్మమైన తన భర్తను తలచుకొని తీవ్రంగా దుఃఖించసాగింది. ఆమె దుఃఖం చూసేవారికి కూడా దుఃఖాన్ని కలిగించసాగింది.

వసంతుని ఓదార్పు

చివరకు రతీదేవి తన భర్తతో కలిసి సహగమనం చేయడానికి నిశ్చయించుకుని మన్మధుని స్నేహితుడైన వసంతుని పిలిచి చితి ఏర్పాటు చేయమని చెప్పింది. వసంతుడు రతిదేవితో "అమ్మా నేను నీ కుమారుని వంటి వాడను. కుమారుడును నేనుండగా నీవు సహగమనం చేయుట సబబు కాదు" అని వసంతుడు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పిన రతీదేవి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను.

సహగమనానికి ఏర్పాట్లు - ఆకాశవాణి వాక్కులు

సతీదేవి సహగమనానికి వసంతుడు గంగానది తీరంలో ఏర్పాట్లు చేశాీడు. సతీదేవి గంగాస్నానం చేసి సహగమనం చేసేముందు ఆచరించాల్సిన కర్మలు పూర్తిచేసి భర్తను స్మరిస్తూ చితిలోకి ప్రవేశం చేయబోయే సమయంలో ఆకాశవాణి "కల్యాణీ పతిభక్తిమతీ! అగ్ని ప్రవేశము చేయవద్దు. శివుని వలనను, శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. ఇప్పుడు మరణించిన మన్మధుడు రెండవ జన్మలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిల కుమారుడు ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు కూడా బ్రహ్మశాపము వలన సంబరసుని ఇంట జన్మిస్తావు. నీ భర్తయగు ప్రద్యుమ్నుని శంబరాసురుని ఇంటనే కలుసుకుంటావు. ఆ విధముగా నీవు తప్పకుండా నీ భర్తను చేరుకుంటావు. కాబట్టి అగ్ని ప్రవేశమును చేయవద్దు" అని పలికెను.

సతీదేవిని ఊరడించిన దేవతలు

ఆకాశవాణి మాటలను పాటించి రతీదేవి సహగమనం ఆలోచన విరమించుకుంది. తరువాత బృహస్పతి, ఇంద్రాది మున్నగు దేవతలు ఆ ప్రదేశానికి చేరుకొని తమ ప్రయోజనం కోసం శరీరం కోల్పోయిన మన్మధుని భార్య రతిదేవిని అనేకరకాలుగా ఊరడించారు. ఆమెకు అనేక వరములనిచ్చిరి. దేవతలు రతిదేవితో "ఓ దేవి! శివుని నేత్రాగ్నిలో దహింపబడి శరీరం కోల్పోయిన మన్మధుడు నేటినుంచి 'అనంగుడ'ను పేరుతో నీకు మాత్రము యధాతధంగా శరీరంతో కనిపిస్తాడని" వరం ఇచ్చి, ఆమెను ఊరడించి ఆమెకు అనేక ధర్మాలను ఉపదేశించారు.

రతిదేవికి దేవతల ధర్మోపదేశం

రతిదేవితో దేవతలు "కళ్యాణి! నీ భర్త మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజు. అప్పుడు కూడా నీవు అతని భార్యవే! రజోదోష ధర్మాలను నీవు పాటింపకపోవడం వల్లనే నేడు నీకు ఈ దుస్థితి కలిగింది. కాబట్టి నీవు రానున్న వైశాఖ మాసంలో గంగా స్నానం చేసి వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువునర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును" అని దేవతలు రతిదేవికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి అదృశ్యమయ్యారు

వైశాఖ వ్రతం ఆచరించిన రతీదేవి

దేవతలు చెప్పినట్లుగా రతీదేవి దుఃఖాన్ని దిగమింగుకుని వైశాఖ మాసంలో అశూన్యశయన వ్రతము ఆచరించెను. ఆ వ్రతప్రభావంతో మనందుడు శరీరంతో ఆమెకు మాత్రమే కనబడసాగెను. ఆ విధంగా రతీదేవి తన భర్తతో కలిసి సుఖంగా ఉండెను.

శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మహామునుల సంవాదం

మన్మధుడు పూర్వజన్మలో సుందరుడనే రాజుగా ఉన్నప్పుడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖ మాసంలో దానాలు చేయలేదు. అందుకే మన్మధుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. "చూశావుగా మహారాజా! వైశాఖ వ్రతం ఆచరించకపోవడం వలన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు కుమారునికి ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి? కాబట్టి యిహలోక సుఖములను ఆశించువారు తప్పకుండా వైశాఖవ్రతము ఆచరించాలి" అని శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు తెలిపాడు.నారదుడు అంబరీషునితో ఈ కథను ఇక్కడవరకు చెప్పి వైశాఖ పురాణం పదకొండో అధ్యాయాన్ని ముగించాడు. 

వైశాఖ పురాణం పదకొండో అధ్యాయం సమాప్తం.

Comments

Popular posts from this blog

Madurai Meenakshi Temple: శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయం - మదురై

Annavaram Kalyanotsavam 2025: శ్రీ సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవ 2025 తేదీలు - అన్నవరం

Tirupati Ganga Jatara 2025: తిరుపతి గంగమ్మ జాతర

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Shani Trayodashi: శని త్రయోదశి

Sarpavaram Bhavanarayana Swamy: శ్రీ భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం 2025 – సర్పవరం

Srisailam Brahmotsavam 2025: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 - శ్రీశైలం

Chaitra Masam 2025: చైత్రమాసంలో పండుగలు, విశేషమైన తిధులు

Narayanavanam Agasteswara Swamy Brahmotsavam: శ్రీ అగస్తీశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 - నారాయణవనం