Katyayani Vratam: కాత్యాయని వ్రతం
పరమశివుని అర్ధాంగి పార్వతికి మరో పేరు కాత్యాయని. శ్రీ కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో చేస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే మంగళవారం రోజు ఈ వ్రతాన్ని ఆరంభించాలి. కృత్తికా నక్షత్రంతో కానీ, షష్టి తిథితో కానీ కూడిన మంగళవారం అయితే మరీ మంచిది.
కాత్యాయని వ్రత విధానం
కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో మంగళవారం రోజు మొదలుపెట్టి 7 మంగళవారాలు భక్తితో ఆచరించాలి. మధ్యలో ఏ వారమైన ఆటంకం వస్తే ఆపై వారము చేసుకొని 8వ మంగళ వారము ఉద్యాపన చేసుకోవాలి.
పూజ విధానం
కాత్యాయని వ్రతం ఆచరించే వారు సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ వ్రతాన్ని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ఆచరించాలి. ముందుగా ఒక పీటపై ఎర్రని వస్త్రాన్ని పరిచి, దానిపై బియ్యాన్ని పోసి, బియ్యం పైన రాగి చెంబు గాని, ఇత్తడి చెంబు గాని ఉంచి, దానిపై టెంకాయను ఉంచి కలశం సిద్ధం చేసుకోవాలి. కలశాన్ని ఎర్రని వస్త్రం అలంకరించాలి.
పీటపై శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి గంధం, కుంకుమ, ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించాలి. దీపారాధన చేసుకోవాలి. ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించాలి. ఎర్రని అక్షింతలతో పార్వతి పరమేశ్వరులకు షోడశోపచార పూజలు, అష్టోత్తర శతనామ పూజలు చేయాలి. పూజించిన అక్షింతలను శిరస్సున వేసుకోవాలి. తర్వాత పిండివంటలతో తయారు చేసిన మహా నైవేద్యం సమర్పించాలి. మంగళ హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. చివరగా వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. ఇలా 7 వారాలు పూజ చేసుకున్న తర్వాత ఎనిమిదో వారం ఉద్యాపన చేసుకోవాలి.
ఉద్యాపన ఇలా!
ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటు స్నానం చేయించాలి. అలా వీలు కాని వారు ఉదయం ముత్తైదువుల ఇంటికి వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తల స్నానమునకు ఇచ్చి రావలెను. ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు, చీర, 7 రవికలను వాయనమిచ్చి వారిచే అక్షతలు వేయించుకొని ఆశీస్సులు పొందవలెను. ముత్తైదువులకు దక్షిణ తాంబూలాదులతో కాత్యాయన వ్రత పుస్తకములను సమర్పించాలి.
కాత్యాయని వ్రత ఫలం
భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తే వివాహం జరగడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే కాత్యాయని అనుగ్రహంతో ఇబ్బందులు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది."ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి! తన్నో దుర్గిః ప్రచోదయాత్" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది.
Comments
Post a Comment