SKANDAGIRI SUBRAMANYA SWAMY TEMPLE: స్కందగిరి సుబ్రమణ్యస్వామి ఆలయం - సికింద్రాబాద్
దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కార్తికేయుడు, మురుగన్, స్కందుడు, కుమారస్వామి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు. కుమార స్వామి కారణజన్ముడనీ తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం.
పేరులోనే స్కందుని నిలుపుకున్న స్కందగిరి సుబ్రహ్మణ్యుని ఆలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్లో వెలసి ఉంది. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుడు శ్రీవల్లీదేవసేన సమేతంగా కొలువై ఉన్నాడు.
ఆలయ స్థల పురాణం
స్కందగిరి ఆలయ స్థల పురాణం పరిశీలిస్తే ఇక్కడ స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలలోకి కనబడి గుడిని కట్టాలని ఆదేశించారు. ఆయన సికింద్రాబాద్లోని పద్మారావునగర్లో ఆంజనేయుడి విగ్రహం సమీపంలో ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఉన్న సహస్ర నామాలలో ఒకటైన 'స్కంద' అనే పేరు ఏర్పడగా, కొండమీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో 'గిరి 'అన్న పదం చేర్చి 'స్కందగిరి'గా ఈ ఆలయానికి సార్ధక నామధేయం ఏర్పడింది.
ఆలయ సముదాయం
స్కందగిరి ఆలయంలో ప్రధాన మూలవిరాట్టు సుబ్రహ్మణ్యస్వామియే అయినప్పటికీ భక్తులు ఆలయ ప్రాంగణంలో అనేక ఉప ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. సుందరగణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి, లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి దుర్గామాత నటరాజ ఆలయం, నాగదేవతలు, షణ్ముక, నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆదిశంకరాచార్యుల పాదుకులను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు.
పూజోత్సవాలు
ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు నిత్య పూజలు జరుగుతాయి. మంగళ, గురు, ఆదివారాల్లో సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామికి 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు చొప్పున నియమ నిష్టలతో అభిషేకం చేయించుకుంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం కోరుకునే వారికి సంతానభాగ్యం కలుగుతుందని విశ్వాసం.
విశేష పూజలు
ఇక ప్రతినెలా వచ్చే రెండు షష్టి తిధుల్లోనూ, ఆడి కృత్తిక, సుబ్రహ్మణ్య షష్టి, నాగ పంచమి, నాగుల చవితి రోజుల్లో సుబ్రహ్మణ్యునికి విశేష అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఈ సమయంలో జరిగే కావడి ఉత్సవాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. ఈ కావడి ఉత్సవాల్లో పాల్గొంటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని విశ్వాసం.
దుర్గాదేవి పూజ
ప్రతి మంగళవారం, శుక్రవారం రాహుకాలం సమయంలో దుర్గాదేవి సమక్షంలో భక్తులు రాహుకేతు దోషాలు పోగొట్టుకోవడం కోసం నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు. ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయనీ, పెళ్లిళ్లు కుదురుతాయనీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని భక్తులు విశ్వసిస్తారు.
ప్రదక్షిణాలు
ఇక స్కందగిరి ఆలయంలో అన్ని ఉపాలయాలను కలుపుతూ చేసే ప్రదక్షిణాలకు ఎంతో మహిమ ఉంది. 51 కానీ, 101 కానీ ప్రదక్షిణాలు చేస్తే చేస్తే గ్రహదోషం పోతుందని, సంతానంలేని వారికి సంతానం కలుగుతుందని, రుణవిమోచన కలుగుతుందని శాస్త్రవచనం.
పరమశివునికి ప్రత్యేక హోమాలు
స్కందగిరి ఆలయంలో శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన కార్తికమాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాన్యాస పూర్వ రుద్రాభిషేకాన్ని, విశేషమైన హోమంతో కలిపి చేస్తారు. ప్రత్యేక అలంకరణలతో యాగశాలను రూపొందించి, 108 రుత్వికులు మహాన్యాస పారాయణంతో జరిపే ఈ హోమంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు.
నక్షత్ర పూజ
సుబ్రహ్మణ్యుని సమక్షంలో జరిగే నక్షత్ర పూజ విశేషమైనది. ప్రతిమాసంలో మన జన్మనక్షత్రం రోజు ఈ పూజ చేస్తారు. ఈ పూజ ఒక ఏడాది పాటు జరిపించుకుంటే జీవితం వచ్చే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని నమ్మకం.
ప్రసాద మహిమ
ప్రతిరోజూ స్వామివారికి నివేదించే చక్రపొంగలి, పులిహోర, దద్ధోజనం, కట్టెపొంగలి, శెనగలు, పంచామృతంకు విశేషమైన మహత్యం ఉందని విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని దర్శించిన వారు ప్రసాదం తీసుకోకుండా వెనుతిరుగరు.
విభూతి మహత్యం
ఇక్కడ సుబ్రహ్మణ్యునికి అభిషేకించిన విభూతిని ప్రసాదంగా పంచుతారు. ఈ విభూతి నుదుటన ధరిస్తే శారీరక మానసిక రోగాలు తొలగిపోతాయని విశ్వాసం.
సికింద్రాబాదు స్టేషన్ నుంచి కేవలం 15 నిముషాల దూరంలో ఉండే ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.
Comments
Post a Comment