Shrinkhala Devi Temple: శ్రీ శృంఖలాదేవి ఆలయం - ప్రద్యుమ్నం

ఈ చరాచర సృష్టికంతటికీ తల్లి అయిన ఆ జగన్మాత నిత్యం బాలింతరాలుగా నడికట్టుతో కొలువుదీరి, తన బిడ్డలను రక్షించే తల్లిగా పేరుపొందిన దేవి-'శృంఖలాదేవి', శృంఖలాదేవి కొలువుదీరిన దివ్యక్షేత్రం ‘ప్రద్యుమ్నం.’

ప్రద్యుమ్నం అష్టాదశ శక్తిపీఠాలలో మూడవది.

అష్టాదశ శక్తులలో తృతీయశక్తి అయిన 'శృంఖలాదేవి' ఆలయం హుగ్లీ జిల్లాలోని 'పాండుపా' అనే గ్రామంలో వుంది. 'పాండుపా' కలకత్తా నగరం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పురాణగాధ

ఇక్కడ శ్రీ శృంఖలాదేవి కొలువుదీరడానికి సంబంధించినపురాణ గాథలు, స్థలపురాణాలు అనేకం ప్రచారంలో వున్నాయి. త్రేతాయుగంలో 'ఋష్యశృంగ మహర్షి' శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఋష్యశృంగుడి తండ్రి విభాండకుడు. తల్లి చిత్రరేఖ, చిత్రరేఖ ఒక అప్సరస.

ఒకనాడు ఇంద్రసభలో చిత్రరేఖ నాట్యం చేస్తున్న సమయంలో కొన్ని 'లేళ్ళు' సభామండపంలోకి వచ్చాయి. నాట్యం చేస్తూ ఉన్న చిత్రరేఖ వాటిని చూస్తూ తనను తాను మైమరచి ఇంద్రుడిని గురించి పట్టించుకోలేదు. దీనితో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు చిత్రరేఖను ‘మృగి జన్మించు' అని శపించాడు.

తేరుకున్న చిత్రరేఖ శాపవిమోచనమునకై ఇంద్రుడిని ప్రార్ధించింది. అందుకు ఇంద్రుడు-విభాండకుడి వల్ల నీకు కుమారుడు కల్గిన తర్వాత తాపం తొలగిపోతుందని చెప్పాడు.

ఈ విధంగా అప్సరస మృగిగా మారిపోయి భూలోకంలో సంచరించసాగింది. ఒకసారి విభాండకుడు నదిలో స్నానం చేస్తూన్న సమయంలో ఊర్వశిని చూశాడు. దీనితో అతనిలో కామోద్రేకం కలిగి రేత పతనమై అది నీటిలో పడింది. ఆ సమయంలో నదిలో నీరు త్రాగుతూ ఉన్న మృగిలోనికి అది ప్రవేశించింది. అది గర్భం దాల్చింది. ఒక పుత్రుడికి జన్మ నిచ్చింది. ఆ పుత్రుడే ‘ఋష్యశృంగుడు'. పుత్రుడికి జన్మనిచ్చిన మృగి శాపవిమోచనం పొంది ఇంద్రలోకానికి వెళ్ళిపోగా ఋష్య శృంగుడు ఒంటరిగా మిగిలాడు. ఋష్యశృంగుని తలపై ఒక శృంగము కూడా ఉంది. దివ్యదృష్టి ద్వారా తన కుమారుడే అని తెలుసుకున్న విభాండకుడు తన ఆశ్రమానికి తెచ్చి పెంచ సాగాడు. ఋష్యశృంగుడికి జపతపాలు తప్ప మరోలోకం లేదు.

ఆశ్రమము వదిలి బయటకు వెళ్ళేవాడు కాదు. ఋష్యశృంగుడు ఎక్కడ పాదం మోపితే అక్కడ సస్య శ్యామలమే!

ఒకానొకప్పుడు వంగదేశంలో కరువు ఏర్పడింది. ప్రజలు కరువుతో విలవిలలాడసాగారు. కరువు నుంచి ప్రజలను రక్షిం చేందుకు వంగదేశపురాజు అయిన 'రోమపాదుడు' అనేక ఆలోచనలు చేశాడు. చివరకు ఋష్యశృంగుడిని గురించి తెలుసుకుని ఋష్యశృంగుడిని తన రాజ్యానికి రప్పించినట్లయితే కరువు మాయమవుతుందని భావించాడు. అయితే ఋష్యశృంగుడు ఆశ్రమం వదిలి బయటకు రాడు. పరిపరి విధాలుగా ఆలోచించి చివరకు తన రాజ్యంలోని వేశ్యలను ఋష్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు. వారిని చూసిన ఋష్య శృంగుడు వారిని మునికుమారులని భావించాడు. ఎందుకంటే తాను జన్మించినప్పటినుంచి ఆశ్రమంలోనే గడిపాడు.

మునికుమారులను తప్ప ఇతరుల నెవ్వరినీ చూసి ఎరుగడు. వేశ్యల అందాన్ని చూసి ఇంత అందమైన మునికుమారులను ఇంతవరకూ చూడలేదని భావించాడు. ఆ వేశ్యల స్తనములను చూసి వాటిని వింతశృంగములు అని భావించాడు. ఈ ముని కుమారులే యింత అందంగా వింత అయిన శృంగములతో వుంటే వీరి ఆశ్రమం ఇక ఎలా ఉంటుందో అని అను కున్నాడు. వారి ఆశ్రమ అందాలను చూడాలనే కాంక్ష అధికం కాగా ఆ వేశ్యల వెంట బయలుదేరి ఋష్యశృంగుడు వంగదేశంచేరుకున్నాడు. దీనితో వంగదేశంలో వర్షాలు కురిసి సస్య శ్యామలం అయింది. దీనితో సంతోషించిన వంగదేశపు రాజు 'రోమపాదుడు' తన కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగుడికిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా వంగదేశం చేరుకున్న ‘ఋష్య శృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు కథనం. శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంగలాదేవి అనే పేరు ఏర్పడింది. అది కాలక్రమములో 'శృంఖలాదేవి'గా మారిపోయినట్లు పండితులు అభిప్రాయం.

కాగా 'శృంఖలాదేవి' అనేపేరులోని 'శృంఖలా' అంటే ''సంకెళ్ళ' అని. దీనిని బట్టి శృంఖలాదేవి అంటే భక్తులకున్న సమస్యల సంకెళ్ళను తెంచివేసి, వారికి సుఖ సౌఖ్యాలను అందించే దేవి అని భావించడం జరుగుతూ వుంది.

ఈ అభిప్రాయం ఇలా వుండగా, సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డకట్టుకుంటారు. దీనినే బాలింత నడికట్టు అని కూడా పిలుస్తారు. ఆ నడికట్టుకు 'శృంఖల' అనే పేరు ఉండడం వల్ల-క్రొత్తగా ప్రసవించిన చంటిబిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో, అలాగే - శృంఖలాదేవి కూడా నడికట్టును కలిగి వుండి తనను కొలిచే భక్తులను పురిటి బిడ్డలుగా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుందని చెప్ప బడుతూ ఉంది. అంటే ఈ తల్లి భక్తులకు మాతృప్రేమను పంచే అపురూప దేవి!అటువంటి శృంఖలాదేవిని ఋష్య శృంగుడు ప్రతిష్ఠించడమే కాక తన భార్య శాంతాదేవితో కలిసి అనేక సంవత్సరాలపాటు ఆరాధిస్తూ గడిపినట్లు పురాణ కథనం. కాగా ఆది శంకరాచార్యుల వారు కూడా ఈ దేవిని దర్శించినట్లు చెప్పబడుతూ వుంది.

ఆలయ విశేషాలు

పాండుపా గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఆలయం వుంది. ఆలయం బెంగాల్ నిర్మాణశైలిలో దర్శనం ఇస్తుంది, ప్రధాన ఆలయం ముఖమండపం గర్భాలయాలను కలిగివుంది. ప్రధాన గర్భాలయంలో శ్రీ శృంఖలాదేవి అమ్మవారు కొలువుదీరి దర్శనమి స్తారు.

అమ్మవారు స్థానక భంగిమలో నిలుచుని ద్విభుజాలతో కొలువుదీరి దర్శనమిస్తుంది. అమ్మవారికి నడు ముకు గుడ్డ కట్టుకుని దర్శనమి స్తుంది. సాధారణంగా బాలింతలకు ఈ విధంగా నడుముకు గుడ్డ కడతారు. అంటే అమ్మవారు బాలింతరూపంలో కొలువుదీరి ఉందని చెప్పబడుతోంది. ఈ అమ్మవారిని దర్శించి పూజించడంవల్ల గర్భవతులైన మహిళ లకు వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయనీ, కాన్పులు సులభంగా అవుతాయనీ, తల్లీ బిడ్డ ఆరోగ్యవంతంగా వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం.

చరిత్ర

చారిత్రకంగా పరిశీలిస్తే అత్యంత పూర్వం నుంచి పూజలందుకుంటూవున్న అమ్మవారికి 9వ శతాబ్దంలో రాజ పుత్రరాజులు ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. తర్వాత ఢిల్లీ సుల్తానుల పాలనా కాలంలో సుమారు13వ శతాబ్దంలో వివిధ ఆలయాలతో పాటు ఈ ఆలయంపైకూడా దాడి జరిగి ఆలయం ధ్వసం చేయబడగా తిరిగి పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తూ ఉన్నాయి. సుమారు వందసంవత్సరాల క్రితం ప్రస్తుతం దర్శనమిస్తున్న ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.

పూజలు, ఉత్సవాలు

ప్రతిరోజూ పూజలు జరిగే అమ్మవారికి, ప్రతిసంవత్సరం మాఘ మాసంలో ముప్ఫై రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవీనవరాత్రులు, దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలను చేస్తారు.

రవాణా, వసతి సౌకర్యాలు

పాండుపా గ్రామంలో భక్తులకు వసతి సౌకర్యాలు లభించవు. కలకత్తా లేదా హుగ్లీలనుంచి వెళ్ళి దర్శించు కుని తిరిగిరావడం మంచిది. కలకత్తా నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో హుగ్లీజిల్లాలో పాండుపా గ్రామం వుంది. హుగ్లీ నుంచి పాండుపాకుబస్సు సౌకర్యాలు వున్నాయి.

కలకత్తా, హుగ్లీలకి దేశంలోని ప్రధాన నగరాలనుంచి రైలు సౌకర్యాలు వున్నాయి.

పురిటిబిడ్డలుగా తన భక్తులను రక్షించే చల్లని తల్లి 'శృంఖలా 'దేవి' ని దర్శించి తరించవచ్చు.

Comments

Popular posts from this blog

Yogini Ekadasi: యోగిని ఏకాదశి

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Magha Puranam Telugu: మాఘ పురాణం 10వ అధ్యాయం - ఇంద్రుని శాపానికి ఉపశమనం చెప్పిన శ్రీహరి- విశ్వామిత్రునికి వానర రూపం

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Vengamamba Perantalu 2025: శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు (పేరంటాలు) - 2025