Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 12 వ అధ్యాయం
నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయంలో కుమారస్వామి జననం గురించి శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం ద్వారా తెలియజేసిన విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం
శ్రుతకీర్తి మహారాజుతో శృతదేవ మహాముని "ఓ రాజా! ఈ రోజు నీకు పరమ పవిత్రమైన కుమారసంభవం గురించి వివరిస్తాను జాగ్రత్తగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను.
వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం
కుమార సంభవం
మన్మధ దహనం తరువాత పరమ శివుడు కైలాసానికి తిరిగి వెళ్లిపోయాడు. నిరాశతో దైన్యంతో ఉన్న పార్వతిని హిమవంతుడు తన గృహానికి తీసుకెళ్లాడు. కొద్దీ రోజుల తర్వాత పార్వతి ఎలాగైనా పరమ శివుని భర్తగా పొందాలని, అందుకోసం తపస్సు చేయడానికి గంగాతీరంకు వెళ్లెను. ఆ జగన్మాత అయిన పార్వతి నారచీరలు కట్టి, నిరాహారియై గంగాతీరంలో పరమ శివుని కోసం ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించెను.
పార్వతిని పరీక్షించిన శివుడు
పార్వతి పరీక్షింపదలచి పరమ శివుడు బ్రహ్మచారి రూపంలో గంగాతీరానికి చేరి పార్వతి ఎదుట శివుని పరిహసించుచూ, శివనింద చేయసాగెను. కానీ పార్వతికి శివుని పట్ల ఉన్న దృఢమైన అనురాగాన్ని గుర్తించి ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడిగెను. శివుని భర్త కోరుకున్న పార్వతికి తధాస్తు అని వరమిచ్చి కైలాసానికి వెళ్లెను.
శివపార్వతుల కల్యాణం
కైలాసానికి వెళ్లిన శివుడు సప్తర్షులను పిలిచి వారిని హిమవంతుని వద్దకు వెళ్లి పెళ్లిమాటలు మాట్లాడమని పంపించాడు. సప్తర్షులు శివుని ఆజ్ఞ మేరకు హిమవంతుని వద్దకు వెళ్లి శివునికి పార్వతినిచ్చి కన్యాదానం చేయమని ప్రార్ధించారు. హిమవంతుడు అందుకు సంతోషంగా అంగీకరిస్తాడు. ఆ విధంగా పార్వతి తపస్సు ఫలిస్తుంది. ముక్కోటి దేవతలు, సప్తర్షులు, అష్టదిక్పాలకులు సమక్షంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
శివపార్వతుల ఆనంద సమాగమం
శివపార్వతులు హిమాలయాలలోని సుందరమైన వనాలలో విహరిస్తూ ఆనందంగా గడపసాగారు. ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు ప్రవేశిస్తాడు. అదే సమయంలో శివతేజస్సు వెలువడుతుంది. అనువుగాని సమయంలో అగ్నిదేవుని రాకకు శివుడు ఆగ్రహించి, శివతేజస్సును భరింపమని అగ్నికి అందజేస్తాడు.
శివతేజస్సును గంగలో విడిచిన అగ్నిదేవుడు
అగ్నిదేవుడు శివతేజస్సును భరింపలేక గంగమ్మను ప్రార్ధించి ఆమె అనుమతితో గంగానదిలో విడిచి పెడతాడు. కానీ భరింపశక్యం కానీ శివ తేజస్సును గంగ కూడా భరింపలేక రెల్లు పొదల్లో విడిచి పెడుతుంది. రెల్లు పొదల్లోని శివతేజస్సు ఆరు భాగాలుగా మారుతుంది.
శివతేజస్సును భరించిన షట్ కృత్తికలు
ఇదంతా గమనించిన బ్రహ్మ దేవుడు కుమార సంభవానికి నాంది పలకడానికి షట్ కృత్తికలను భూమిపైకి పంపిస్తాడు. షట్ కృత్తికలు రెల్లు పొదల్లో ఆరుభాగాలుగా మారిన శివతేజస్సును ఒక్కటిగా చేస్తారు. అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖాలు కలిగిన బాలునిగా జన్మిస్తాడు. షట్ అంటే ఆరు మంది కృత్తికలు ఆ బాలునికి పాలివ్వగా ఆ బాలుడు ఆరు ముఖాలతో పాలు త్రాగినందున షణ్ముఖుడు అని, కృత్తికలు పెంచినందున కార్తికేయుడనే పేరుతో కుమార సంభవం జరిగింది.
శివపార్వతులను చేరిన కుమారస్వామి
కొన్ని రోజులకు శివపార్వతులు వృషభ వాహనంపై శ్రీశైలానికి వెళ్తూ షణ్ముఖుడు ఉన్న ప్రదేశానికి చేరుకోగానే అప్రయత్నంగా పార్వతి స్తన్యం నుంచి క్షీరధారలు స్రవించసాగాయి. అది చూసి ఆశ్చర్యపోయిన పార్వతి ఇందుకు కారణమేమిటని తన పతి శివుని అడుగుతుంది. అప్పుడు శివుడు కుమారస్వామి జననం గురించి వివరించి షణ్ముఖుడు తమ కుమారుడే అని జరిగిందంతా పార్వతికి వివరిస్తాడు. అప్పుడు పార్వతి పుత్రవాత్సల్యంతో షణ్ముఖునికి స్తన్యమిచ్చి ఆనందిస్తుంది. తరువాత శివపార్వతులు పరమ సంతోషంతో కుమారస్వామితో కలిసి కైలాసానికి వెళ్లిపోతారు.
శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "రాజా! అత్యంత మహిమాన్వితమైన ఈ కుమార సంభవాన్ని చదివినా, విన్నా పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. శివుని కోపాగ్నిలో దహించుకుపోయిన మన్మధుడు మరుసటి జన్మలో వైశాఖ వ్రతం చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యెను. అలాగే రతీదేవి వైశాఖ వ్రతం ఆచరించి మన్మధుని తిరిగి పొందింది. కాబట్టి ఒక్క వైశాఖ వ్రతం ఆచరిస్తే అన్ని ధర్మాలు ఆచరించిన పుణ్యం దక్కుతుంది. ఇదియే వైశాఖ వ్రతంకు ఉన్న గొప్పదనం" అని చెప్పాడు.
నారద మహర్షి ఈ కథను ఇక్కడవరకు చెప్పి వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం.
Comments
Post a Comment