Nellore Ayyappa Temple: శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం - నెల్లూరు
శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నెల్లూరు నగరంలో వెలసింది. దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాలలో ప్రముఖమైనది.
ఈ ఆలయానికి మరో అరుదైన విశిష్టత కూడా ఉంది. సహజంగా అయ్యప్ప మాల ధరించే భక్తులు శబరిమలలో ఇరుముడి చెల్లిస్తారు. కానీ ఏపీలో కూడా ఇరుముడి సమర్పించే అతి కొద్ది ఆలయాల్లో నెల్లూరు అయ్యప్ప గుడి కూడా ఒకటి.
1987లో కేరళ తంత్రులతో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఏటా ఇక్కడ మండల పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప మాల ధారణ సమయంలో భక్తులు జిల్లా నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు. మాల ధరించిన స్వాములకు నిత్యాన్నదానం ఉంటుంది. జిల్లానుంచి బయలుదేరే అయ్యప్పస్వాములంతా ఈ ఆలయం వద్ద ఆగి, స్వామిని దర్శించుకుని తమ యాత్ర మొదలు పెట్టడం ఆనవాయితీ.
శబరిమల ఆలయంలాగే ఇక్కడ కూడా ఉపాలయాల నిర్మాణం ఉంది. పదునెట్టాంబడి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ప్రధాన ఆలయంలో కేరళ తంత్రులు మాత్రమే పూజలు నిర్వహిస్తుంటారు. ఉపాలయాల్లో స్థానిక పూజారులుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే సంతానం లేనివారికి ఆ అదృష్టం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఆలయ వేళలు
ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 వరకు.
Comments
Post a Comment