Nadipudi Subramanya Swamy Temple: శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - నడిపూడి
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్న నడిపూడి గ్రామంలో ఈ ఆలయం. ఇక్కడ స్వామి వారు సర్ప రూపంలో దర్శనం ఇవ్వడం విశేషం.
ఈ ఆలయంలో స్వామి స్వయంభువుగా వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
1973 సంవత్సరంలో ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమము, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్ప రూపంలో నాశికా త్రయంబకం నుంచి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ ఋషుల తపస్సులు, పండితుల వేద ఘోషతో నిత్యం విరాజిల్లే వశిష్ట గోదావరి నదీ ఒడ్డుకు చేరుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత శ్రీ స్వామి వారు ఒక భక్తునికి స్వప్నంలో కనిపించి తనకు గ్రామోత్సవము జరిపించమని, గ్రామోత్సవము జరిపించిన ఆ పల్లకి ఎక్కడ ఆగిపోతుందో ఆ ప్రదేశంలోనే తనని ప్రతిష్టించమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తుల సహకారంతో స్వామి వారి కోరిక ప్రకారం అరటి దొప్పలతో పల్లకి తయారు చేసి స్వామి వారిని గ్రామంలో ఊరేగించి, పల్లకి ఆగిన చోట ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయంభువుగా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు.
ఎంతో ప్రసిద్ధమైన ఈ క్షేత్రంలో స్వామి వారికి తూర్పు వైపున ద్వారబంధము లోపల స్వామి పుట్ట ఉన్నది. ఇది ఎవరు నిర్మాణం చేసింది కాదు. స్వామి వారు ఈ పుట్టలో సర్ప రూపంలో కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఈ పుట్టను దర్శనం చేసుకోవడానికి దేవస్థానం వారు ఒక అద్దాన్ని ఏర్పాటు చేసారు. ఈ నాటికీ ఈ పుట్టలో సర్పం ఉంటుంది. ఈ సర్పం రాత్రివేళలో ఆ పుట్టలోకి ప్రవేశించి, ఉదయాన్నే బయటకు వెళ్లిపోతుంది.
కుజ దోషాలు, సర్ప దోషాలతో బాధపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేయడం వలన, ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.
ఆలయంలో జరిగే విశేష పూజలు
- ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజూ అభిషేకం, కళ్యాణము జరుగును.
- మార్గశిర శుద్ధ పంచమి రోజు రాత్రి స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
- మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజు రథోత్సవం, తిరునాళ్లు వేడుకగా జరుగుతాయి.
- ఆషాడ శుద్ధ షష్ఠి, కృత్తికా నక్షత్రం రోజు విశేష పూజలు జరుగుతాయి.
- శ్రావణ శుద్ధ పంచమి రోజు స్వామివారికి విశేష క్షీరాభిషేకాలు జరుగుతాయి.
- ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కన్నుల పండుగలా జరుగుతుంది.
- నాగుల చవితి, స్కంద షష్ఠి రోజు స్వామి వారికి పాలాభిషేకాలు జరుగుతాయి.
రాజమండ్రి నుంచి ఈ ఆలయం చేరుకోవడానికి ఆటో, బస్సు సౌకర్యం కలదు.
Comments
Post a Comment