రామాయణ కాలంలో తుంగభద్రే పంపానదిగా పేరుపొందింది. ఇది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. కర్ణాటకలోని పడమటి కనుమలలో తుంగ, భద్ర అనే రెండు నదులు జన్మించి ఒకటిగా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తాయి. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో స్వర్ణయుగాన్ని స్థాపించిన విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర ఒడ్డునే వెలిసింది. శృంగేరి, హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.
తుంగభద్ర ప్రస్థానం
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కూడ్లి వద్ద తుంగ, భద్ర నదుల సంగమస్థలం ఉంది. పశ్చిమ కనుమలలో పుట్టిన ఆ రెండు నదులూ కూడ్లి వద్దనే ఏకమౌతాయి. అక్కడి నుండి శృంగేరి పీఠం, హంపిల మీదుగా తుంగభద్ర కర్నూలు జిల్లా కౌతాలం మండలం మేళగనూరు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత మంత్రాలయం. మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం మీదుగా, మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్ (తెలంగాణ) వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది. తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ఆనకట్ట నిర్మితమైంది.
పురాణాల ప్రకారం తుంగభద్ర ఆవిర్భావ కథ వరాహావతార కాలంలో కనిపిస్తుంది. హిరణ్యాక్షుని సంహరించిన తరువాత శ్రీమహావిష్ణువు బాగా అలిసిపోయాడు. కర్ణాటకలోని వరాహపర్వతంపై ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఆ పర్వతంపై ఆయన కూర్చోగానే ఒంటినుంచి స్వేదం విపరీతంగా వచ్చింది. ఎడమవైపు నుంచి స్రవించిన శ్రీమహావిష్ణువు స్వేదమే తుంగానదిగానూ, కుడివైపు స్రవించిన స్వేదమే భద్రానదిగా మారాయి. అక్కడి నుంచి తుంగానది 147 కిలోమీటర్లు, భద్రానది 171 కిలోమీటర్లు ప్రవహించి కూడ్లివద్ద సంగమిస్తున్నాయి.
తుంగభద్ర తీర్థాలు
దేవగురువు బృహస్పతి ఏడాదికి ఒకసారి ఒక్కోరాశిలో సంచరిస్తుంటాడు. అలా బృహస్పతి సంక్రమణం జరిగిన రోజు నుంచి పన్నెండు రోజుల పాటు పవిత్ర నదులకు పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. పూర్వం బ్రహ్మనుంచి బృహస్పతి పొందిన వరం ప్రకారం పుష్కర సంప్రదాయం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ముక్కోటి దేవతలు ఆయా నదీజలాల్లో కొలువుంటారని నమ్మిక. పుష్కర సమయంలో నిర్వహించిన పితృకార్యాలు, నదీస్నానం, దానం వంటివన్నీ రెట్టింపు ఫలాలనిస్తాయని చెబుతారు.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఆలంపూర్లో పుష్కరాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కర్నూలులో జిల్లాలోని మంత్రాలయం, సంగమేశ్వరం, కౌతాలం, గురజాల, పుల్లికల్, రాజోలి, నాగల దిన్నెలలో పుష్కర స్నానానికి అనువుగా ఉంటాయి.
మంత్రాలయం
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం వెలిసిన మంత్రాలయం దివ్యక్షేత్రం. మధ్వాచార్యులు బోధించిన ద్వైతమతానికి తెలుగునాట ముఖ్యగురువు రాఘవేంద్రులే. వారిని భక్తులు ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు రాఘవేంద్రులు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చెబుతారు. అనంతరం ఆదోని నవాబు నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు. పుష్కరాల సమయంలో తుంగభద్రను సేవించడానికి వచ్చేవారికి మంత్రాలయం అనువుగా ఉంటుంది. ప్రయాణ, వసతి సౌకర్యాలు లభిస్తాయి. అన్నదాన సత్రాలున్నాయి.
సంగమేశ్వరం
మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం... ఈ అయిదింటినీ పంచేశ్వర లింగాలని పిలుస్తారు. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వర ఆలయం. ఉంది. ఏడునదులు ఏకంగా కలిసే ప్రదేశమిది. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. ద్వాపరయుగంలో పాండవులు ఈ స్వామిని ప్రతిష్ఠించినట్లు కథనం. నివృత్తి సంగమేశ్వరం, రూపాల సంగమేశ్వరం, కూడల సంగమేశ్వరం అనే మూడు ప్రధాన ఆలయాలున్నాయి. శ్రీశైల జలాశయం నిర్మించే సమయంలో ముంపుకు గురయ్యే అవకాశమున్న వీటిని వేర్వేరు ప్రాంతాల్లో ప్రతిష్ఠించారు. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయమిది.
అలంపురం
శ్రీశైలానికి పశ్చిమ ద్వారం అలంపురం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన జోగులాంబ వెలసిన చోటు కూడా అలంపురమే. ఇక్కడి శివుడు బాలబ్రహ్మేశ్వరునిగా పూజలందుకుంటాడు. బాదామి చాళుక్యులు నవబ్రహ్మల ఆలయాలను నిర్మించారు. ఇవన్నీ తుంగభద్ర ఒడ్డునే ఉన్నాయి. పదకొండో శతాబ్దికి చెందిన అపురూపమైన శిల్పసంపదకు అలంపురం నెలవు. కాగా శాతవాహనుల కాలంనుంచే అలంపురం ప్రసిద్ధ తీర్ధయాత్రాస్థలంగా ఉండేదని ఇటీవలి శాసనాలు తెలియచేస్తున్నాయి. అలంపురం క్షేత్రం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. పుష్కరయాత్రికులకు అలంపురంలో ఏర్పాట్లు బాగుంటాయి. హైదరాబాదు నుంచి 220 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 25 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 335 కిలోమీటర్ల దూరంలో అలంపురం ఉంది.
హంపీ
ఒకనాటి విజయనగర సామ్రాజ్యమే నేటి హంపీ. కర్ణాటకలోని బళ్లారిలో ఉంది. విరూపాక్ష స్వామి దేవాలయం ఇక్కడ ప్రసిద్ధి గాంచిన ఆలయాల్లో ఒకటి. భువనేశ్వరీ మాత ఆలయం, పంపాదేవి గుడి, విఠల దేవాలయం, యంత్రోద్ధారక హనుమాన్, కోదండరామస్వామి ఆలయం, ఏకశిలారథం వంటివన్నీ హంపీలో చూడదగిన ఆధ్యాత్మిక ప్రదేశాలు. కాగా చారిత్రకంగా స్వర్ణయుగాన్ని స్థాపించిన ఆనాటి విజయనగర శిథిలాలను నేడు దర్శించవచ్చు. తుంగభద్రానది ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నది. పుష్కరాల సమయంలో హంపి క్షేత్రంలో వసతి సౌకర్యాలు లభిస్తాయి. హైదరాబాద్ " నుంచి హంపికి 375 కిలోమీటర్లు. 5 బెంగళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరం.
Comments
Post a Comment