శ్రీ పొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన ఈ ఆలయం కొలువైంది.
త్రేతాయుగంలో కశ్యపమహర్షి ఈ ప్రాంతంలో యజ్ఞం చేసినట్లు కథనం. కశ్యప మహర్షి యజ్ఞవాటిక కనుక ఆ అర్థం వచ్చే జన్నవాడ అనే పేరు ఈ ప్రాంతానికి ఏర్పడింది. అది కాలక్రమంలో జొన్నవాడ అయినట్లు స్థలపురాణం వెల్లడిస్తోంది.
స్థలపురాణం
పూర్వం కశ్యపమహర్షి వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ పెన్నానది తీరంలోని వేదాద్రికి చేరుకొని ఆ ప్రాంతంలో ఒక యజ్ఞాన్ని చేయదలచి యజ్ఞ వాటికను నిర్మించుకుని యజ్ఞం చేయడం ప్రారంభించాడు.ఈ విధంగా కశ్యపమహర్షి యజ్ఞం చేయడం పూర్తికాగాన ఆ యజ్ఞవాటిక నుంచి పరమేశ్వరుడు ఉద్భవించి క్రీ మల్లికార్జునస్వామిగా పూజలందుకున్నాడు. కైలాసంలో పరమ శివుడు లేకపోవడంతో పార్వతీదేవికి దిక్కుతోచలేదు. చివరకు పరమేశ్వరుడు భూలోకంలో ఉన్న విషయం తెలుసుకున్న పార్వతీదేవి భూలోకానికి చేరుకుంది. పార్వతీదేవిని చూసిన పరమేశ్వరుడు ఈ జొన్నవాడ నేను వదిలిపెట్టను కనుక నువ్వు కూడా ఇక్కడే ఉండి పూజలందుకుంటూ ఉండు అని పలికాడు. అందుకు అంగీకరించిన పార్వతీదేవి శ్రీకామాక్షితాయిగా కొలువుదీరినట్లు స్థలపురాణ కథనం.
కాగా ప్రచారంలో ఉన్న మరో గాథ ప్రకారం పూర్వం వృషపర్వుడు అనే రాక్షసుడు తపస్సు చేసి దేవతల నుంచి వరాలు పొంది లోక కంటకుడు అయ్యాడు. ప్రజలను పీడించడంతోపాటు చివరికి దేవతలపై దండెత్తాడు. స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుడు వృషపర్వుడి చేతిలో ఓడిపోయి స్వర్గలోకం వదిలి తన పరివారంతో హిమాలయాలకు వెళ్లి కాలం గడపసాగాడు. చివరకు శ్రీ కామాక్షితాయి మహిమను గురించి విని శచీదేవి సమేతుడై ఇంద్రుడు జొన్నవాడకు చేరుకుని శ్రీ కామాక్షితాయిని ఆరాధించి స్వర్గలోకంపై దండెత్తి వృషపర్వుని ఓడించి తిరిగి స్వర్గలోకాన్ని పొందినట్లు తెలుస్తోంది.
ఈ ఆలయం పల్లవుల కాలంలో నిర్మింపబడినట్లు తెలుస్తోంది. పల్లవులు, చోళులతోపాటు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వివిధ రాజవంశాలకు చెందిన చక్రవర్తులు అందరూ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరును పరిపాలించిన రాజవంశాలతో పాటు విజయనగర చక్రవర్తుల కాలంలో ఆలయం విశేష అభివృద్ధి చెందింది.
జొన్నవాడలో కామాక్షితాయి అమ్మవారి 'ఆలయం పక్కనే పెన్నా నది ఉంది. దీనికి కశ్యప తీర్థం అని పేరు. అత్యంత మహిమాన్వితమైన ఈ తీర్థంలో స్నానం చేస్తే సకలోపాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం, కవిత్రయములో ఒకరైన మహాకవి తిక్కన ఈ తీర్ధములో స్నానమాచరించి మహాభారత రచన చేసినట్లు చెప్పబడుతోంది. అంతేకాకుండా తిక్కన ఇక్కడ యజ్ఞం చేసి తిక్కన సోమయాజి అయ్యాడని ప్రతీతి.
పవిత్ర పెన్నానది ఉత్తర తీరంలో ఆలయం శిల్పకళా శోభితమై దర్శనమిస్తుంది. తూర్పు ముఖంగా ఉండే ఆలయ ప్రధానద్వారంపై రాజగోపురం దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా విశాలమైన మండపంలో బలిపీఠం, ధ్వజస్తంభం దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయం విశాలమైన రంగమండపం కలిగి ఉంది. రంగ మండవంలో వరుసగా ఆలయాలు ఉన్నాయి.
ముందుగా భక్తులు తొలి పూజలందుకునే వినాయకుడు కొలువుదీరిన ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయానికి పక్కనే సుబ్రహ్మణ్యస్వామివారు ప్రత్యేక ఆలయంలో వల్లీదేవసేనాసమేతుడై కొలువుదీరి దర్శనమిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ప్రక్కనే శ్రీమల్లికార్జునస్వామి వారు లింగ రూపంలో కొలువుదీరి అభిషేకాలు, అర్చనలు అందుకుంటూ భక్తులపై కరుణాకటాక్షాలు ప్రసరింపచేస్తూ దర్శనమిస్తారు. స్వామివారి కుడివైపున ఉన్న గర్భాలయంలో ఈ క్షేత్ర ప్రధాన దేవత అయిన శ్రీ కామాక్షితాయి ఆలయం ఉంది. ఈ ఆలయం ముఖమండపం అంతరాలయం, గర్భాలయాలను కలిగివుంది. గర్భాలయంలో శ్రీ కామాక్షితాయి అమ్మవారు స్థానక భంగిమలో నిలుచుని చతుర్భుజాలతో దర్శనమిస్తారు. అమ్మవారి మూలవిరాట్టు అత్యంత ఎత్తైన రూపం కాదు. అంతేకాక గర్భాలయ ద్వారం అంత ఎత్తులో ఉండదు కనుక కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకోవాలంటే భక్తులు రంగమండపంలో కూర్చుని దర్శించుకోవచ్చు. అమ్మవారి ఆలయం కుడివైపున ఆదిశంకరాచార్యులవారి విగ్రహం దర్శనమిస్తుంది ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ కామాక్షితాయిని పూజించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి, నవగ్రహ మండపం, వాహన మండపం వంటివాటిని భక్తులు దర్శించుకోవచ్చు.
ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులపాటు కన్నుల పండువగా జరుగుతాయి. వివిధ వాహన సేవలు, రథోత్సవం, అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. ఆశ్వీయుజమాసంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకారాలు, ఉత్సవాలను నిర్వహిస్తారు.
జొన్నవాడలో ప్రత్యేక భవనాలు ఉన్నాయి. వసతి సౌకర్యం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో జొన్నవాడ ఉంది.
Comments
Post a Comment