ఆశ్వయుజ శుద్ధ ద్వాదశిని పద్మనాభ ద్వాదశి అంటారు. ఈ రోజు శ్రీ మహా విష్ణువు స్వరూపమైన అనంత పద్మనాభ స్వామిని పూజిస్తారు. వ్యాస మహర్షి రచించిన వరాహ పురాణంలో కూడా పద్మనాభ ద్వాదశి వ్రతం గురించిన ప్రస్తావన ఉంది. పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజు జరుపుకునే పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయని పురాణ వచనం. పూర్వం పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించి శత్రుజయం పొందారని కధనం.
ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నదీస్నానం ఆచరిస్తే పుణ్యం. వీలుకాని వారు గంగాదేవిని స్నానం చేసే నీటిలో ఆవాహన చేసి స్నానం చేయవచ్చు. అనంతరం పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణుల చిత్రపటాలను గంధం కుంకుమలతో అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. అనంతరం లక్ష్మీ నారాయణులను సహస్రనామాలతో అర్చించాలి. పులిహోర, చక్రపొంగలి నైవేద్యంగా సమర్పించాలి.
సాయంత్రం యధావిధిగా పూజ పూర్తి చేసుకుని సమీపంలో విష్ణు ఆలయాన్ని సందర్శించాలి. భాగవత కథలు, పురాణాలు చదువుకోవాలి. పద్మనాభ ద్వాదశి రోజు బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్ర దానం చేస్తే విష్ణు లోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం.
పద్మనాభ ద్వాదశికి కఠిన నియమాలేమి ఉండవు. పూజ పూర్తయ్యేవరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. అసత్యం ఆడరాదు.
భక్తిశ్రద్ధలతో పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే చేపట్టిన పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయి.
2025: అక్టోబరు 04.
Comments
Post a Comment