Pancharatra Agamam: పాంచరాత్ర ఆగమం
పంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్ధం. భగవంతుడు ఐదురోజులపాటు నాగరాజు అయిన గరుత్మంతుడు, అనంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖబ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రఆగమం అనేపేరు వచ్చింది. ఇది శ్రీవైష్ణవ పూజావిధానం. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లోకంలో ప్రతి జీవి పునరావృత్తిరహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది.
హయవదనుడనే రాక్షసుడు వేదాలకు నిధి అయిన బ్రహ్మనుండి తస్కరించి సముద్రగర్భానికి వెళ్ళి దాక్కున్నప్పుడు వేదక్రతువులు జరగక దేవతలశక్తులు తగ్గిపోసాగాయి. అప్పుడు అయిదురాత్రులపాటూ దేవర్షులంతా కలిసి మంత్రం లేనందువలన (వేదాలు లేవు కనుక మంత్రం లేదు) తంత్రంతో పూజచేశారు. ఆవిధంగా విష్ణువు శక్తిమంతుడై మత్స్యావతారం దాల్చి హయవదనుణ్ణి చంపి వేదాలను రక్షించాడు. తిరిగి హయగ్రీవమూర్తిగా మారి వాటిని బ్రహ్మకు ఉపదేశించాడు.
అలా వేదాలు పోయి మరలా తిరిగివచ్చిన వ్యవధి అయిదురాత్రులలో భగవదారాధన వైదిక పద్ధతిలోకాకుండా తంత్రంలో జరిగింది. అందువలన ఆ పంచరాత్రుల పేరుమీద పాంచరాత్రం అని ఈ ఆగమశాస్త్రానికి పేరు రావడం జరిగింది. ఈ ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, అర్ఘ్యము, దైవము తదితర 108 పూజావిధానాలున్నాయి. శ్రీపాద్మసంహిత, శ్రీప్రశ్నసంహిత మొదలైన శాస్త్రాల్లో సూచిం చినప్రకారం శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలను పాంచరాత్రాగమానుసారంగా జరుపుతున్నారు.
వేదమంత్రాలు వేరైనా, వాటి ఉచ్చారణలు వేరైనా, అన్ని వేదాలసారాంశం, భావం ఆ పరంధాముని శరణు వేడి మనజీవితాలు సుఖమయంగా ఉండాలని కోరటమే అని తెలుసు కోవాలి. అన్నివేదాల్లో తెలిపిన ధర్మానికి ఉన్న నాలుగు పాదాలు- సత్యం, శౌచం, తపస్సు, దయ అనే పరమపవిత్రమైన గుణాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ సుఖమయమైన జీవితాన్ని గడుపుతూ మోక్షానికి సోపానాలను వేసుకుందాం. ఏనామంతో పిలిచినా, ఏరూపంతో కొలిచినా ఆ పరమాత్మ ఒక్కడే అనేస్థితికి ఈ మానవుడు చేరినప్పుడు దైవానుగ్రహం పరిపూర్ణమై మరుజన్మ లేనివరాన్ని పొందుతాడు.
Comments
Post a Comment