Tirupatamma Temple: శ్రీ లక్ష్మి తిరుపతమ్మ దేవస్థానం - పెనుగ్రంచిప్రోలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది.
స్థల పురాణం
వత్సవాయి మండలం గోపినేనిపాలేనికి చెందిన కొల్లా శివరామయ్య, రంగమాంబ దంపతులకు సంతానం లేదు. వెంకటేశ్వరుడి వర ప్రసాదంగా ఆ దంపతులకు తిరుపతమ్మ జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచే దైవభక్తి మెండు. ఆమెను పెనుగంచిప్రోలుకు చెందిన కాకాని కృష్ణయ్య వెంగమాంబ దంపతుల కుమారుడు గోపయ్య కిచ్చి పెళ్లి చేశారు. అప్పటివరకు పంటలు పండక, గోవులకు మేత లేక పెనుగంచిప్రోలు అల్లాడిపోయింది. తిరుప తమ్మ అడుగుపెట్టగానే వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామస్థులు ఆనందంగా ఉన్నారు. తిరుపతమ్మ పేరు మారుమోగింది. తట్టుకోలేని తోటికోడలు చంద్రమ్మ ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంది. గోవులు మేపేందుకు గోపయ్య అడవికి వెళ్లినప్పుడల్లా ఆమెకు కష్టాలే. తోటికోడలు పెట్టే బాధలు భర్తకు చెప్పుకోలేక ఆవేదన చెందేది. అదే సమయంలో ఆమెకు ఓ వ్యాధి సోకింది. ఇదే అదనుగా తిరుపతమ్మను తోటికోడలు చంద్రమ్మ ఇంటి నుంచి పంపేసింది. గ్రామానికి చెందిన ముదిరాజు వంశస్థురాలు పాపమాంబ తిరుపతమ్మకు సేవలు చేసింది. 'రోగం శరీరానికే కానీ నా మనసుకు కాదు. నేను ఈ శరీరాన్ని కాదు ఒక దివ్యాత్మను' అని తిరుపతమ్మ పాపమాంబకు చెప్పేది. అడవికి వెళ్లిన గోపయ్య భార్యను చూసేందుకు పెనుగంచిప్రోలు వచ్చాడు. పాపమాంబ సేవలో కనిపించిన తిరుపతమ్మను చూసి దుఃఖానికి గురయ్యారు. తిరుపతమ్మ భరణంగా తెచ్చుకున్న గోవును పులి తినేసిందనే వార్త ఆయన చెవిన పడింది. దానిని చంపేందుకు తిరిగి అడవికి వెళ్లిపోయారు. గోపయ్య పులితో పోరాడి వీరమరణం పొందారు. ఆ విషయాన్ని దివ్యదృష్టితో తెలుసుకున్న తిరుపతమ్మ తాను యోగాగ్ని (మంత్రోచ్ఛారణతో శరీరంలో మంటలు వచ్చి అగ్నికి ఆహుతి కావడం') పాల్పడతానని, అనుమతి ఇవ్వాలని గ్రామ కరణమైన శ్రీశైలపతిని తిరుపతమ్మ కోరింది. అందుకు ఆయన నిరాకరించారు. అంకమ్మతల్లి భక్తుడైన శ్రీశైలపతి పూజలో ఉండగా అంకమ్మ తల్లి ప్రత్యక్షమై 'తిరుపతమ్మ ఎవరో కాదు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి వరప్రసాదిని' అని చెప్పింది. ఆయన ప్రస్తుత ఆలయ ప్రాంతంలో యోగాగ్నికి ఏర్పాట్లు చేశారు. తిరుపతమ్మ అగ్నికి ఆహూతి అయింది. మరునాడు యోగాగ్ని ప్రదేశంలో తిరుపతమ్మ మంగళసూత్రాలు, పసుపు కుంకుమ లభించాయి. కాలక్రమంలో అక్కడే దేవాలయం నిర్మించి వాటిని అందులో ఉంచి పూజలు చేశారు. తిరుపతమ్మకు సేవలు చేసిన పాపమాంబ వంశీయులే ఇప్పటికీ పూజలు చేస్తున్నారు.
యోగాగ్ని తర్వాత ఆలయం నిర్మించి తిరుపతమ్మ, గోపయ్య స్వాముల విగ్రహాలు ఉంచారు. ఉత్సవ విగ్రహాలు తయారు చేయించారు. తిరుపతమ్మ తోటికోడలు చంద్రమ్మ, మల్లయ్య దంపతుల విగ్రహాలు, కరణం శ్రీశైలపతి ఇంట్లోని అంకమ్మ ప్రతిమ, గుంటూరు జిల్లా వినుకొండ భక్తులు తెచ్చిన అంకమ్మ విగ్రహం గుడిలో పెట్టారు.
గోపయ్యని చంపిన పులి జేష్టాదేవి (పెద్దమ్మ) విగ్రహం కూడా గుడిలో ఉంది.
ఏటా పెద్ద తిరునాళ్ల నిర్వహి స్తారు. ఆ వేడుక జరిగిన నెల రోజుల్లో చిన్న తిరునాళ్ల ఉంటుంది. నవరాత్రి వేడుకలు నిర్వహిస్తారు.
Comments
Post a Comment