Hemavathi Siddeshswara Temple: శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం
విగ్రహరూపంలో పరమేశ్వరుడు పూజలందుకునే ఆలయాలు ఏపీలో రెండున్నాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా గుడిమల్లం అయితే మరొకటి సత్య సాయి జిల్లా అమలాపురం మండలం హైమావతి గ్రామంలో ఉంది. హైమావతి పేరు కాలక్రమేణా హేమావతిగా మారింది. క్రీ.శ. 9-10 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో శివుడు విగ్రహరూపంలో సిద్ధాసనంలో కూర్చుని ఉంటాడు.
గర్భగుడిలో ఉన్న పరమేశ్వరుడి విగ్రహం 5.5 అడుగులు. హేమావి క్షేత్రానికి నోలంబుల రాజుల కాలంలో హేంజేరు అని మరో పేరు ఉండేది. ఈ ప్రాంతాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని సుమారు 32 వేల గ్రామాలను నోలంబ రాజులు పాలించేవారనీ ఇక్కడున్న శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. 32 వేల గ్రామాలంటే...ప్రస్తుతం ఉన్న అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటూ కర్ణాటకలోని తూముకురు, చిత్రదుర్గం, కోలార్, తమిళనాడులో సేలం, ధర్మపురి జిల్లాల్లో గ్రామాలున్నీ పాలించేవారు.
నోలంబ రాజుల్లో ముఖ్యుడైన రాజమహేంద్రుడికి సంతానం లేదు. ఎన్నో పూజలు హోమాలు చేశారు. ఓరోజు రాజమహేంద్రుడి కలలో కనిపించిన పరమేశ్వరుడు..తన విగ్రహం ప్రతిష్టిస్తే సంతాన ప్రాప్తి ఉంటుందని, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పాడు. కలలో శివుడు చెప్పినట్టే విగ్రహం ప్రతిష్టించాడు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనివిధంగా శివలింగాలు బ్రహ్మముడితో ఉండటం విశేషం. సాధారణంగా ఆలయాలకు తూర్పుద్వారం ఉంటుంది...కానీ హేమావతి గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి ముఖద్వారం పడమరవైపు ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా గర్భగుడికి కిటికీలు ఉండవు..గాలి వెలుతురు వచ్చే అవకాశం లేకుండా నిర్మిస్తారు. కానీ సిద్దేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి కిటికీలు కనిపిస్తాయి.
ఆలయంలో శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. స్తంభాలన్నీ నున్నటి నల్లని రాయితో చెక్కారు. ఆలయ గోడలపై పురాణ ఇతిహాసాలు చెక్కి ఉంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో శిల్పకళను నేర్పించేవారు.
ఎంజేరు హైమావతి క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కళ్యాణి బావి గురించి. ఈ బావిలో నీటిని తాగిన వారికి దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఏటా శివరాత్రి సమయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే అగ్నిగుండం రోజున ... రైతులు పొలంలో వేసిన పంట రకంలో కాస్త అగ్నిగుండానికి అర్పిస్తే దిగుబడి బావుటుందని విశ్వాసం. నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ఆలయం కార్తీకమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ దేవాలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.
Comments
Post a Comment