Shiva Puranam: శివమహాపురాణం
అష్టాదశ పురాణాలలో శివపురాణం నాలుగోది. వాస్తవానికి ఇది చాలా పెద్దది. తొలుత 12 సంహితలతో లక్ష శ్లోకాలతో ఉండేదంటారు. ప్రస్తుతం ఈ పురాణాన్ని 24వేల శ్లోకాలకు కుదించారు.వాయువేయ సంహితలో శివమహాపురాణానికి సంబంధించిన ఎన్నెన్నో అంశాలు ప్రస్తావితమై ఉన్నాయి. శివమహా పురాణంలో ఉన్న సంహితలు, ఖండాల్లో శివతత్త్వసారం తేటతెల్లమవుతుంది.
ఈ పురాణానికి సంబంధించి విద్యేశ్వర సంహితలో 25 అధ్యాయాలున్నాయి. ప్రత్యేకించి సృష్టి ఖండం అనే దానిలో 20. సతీ ఖండంలో 43, పార్వతీ ఖండంలో 55, కుమారఖండంలో 20, యుద్ధఖండంలో 59 అధ్యాయాలున్నాయి. ఉమాసంహితలో 51, కైలాస సంహితలో 23 అధ్యాయాలున్నాయి. శివపురాణానికి సంబంధించిన వాయవీయ సంహిత రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిదానిలో 35. రెండో దానిలో 41 అధ్యాయాలున్నాయి. ఈ సంహితలన్నింటిలోని ఖండాలు, అధ్యాయాలన్నింటిలోనూ శివ సంబంధమైన ఎన్నెన్నో ఉపాఖ్యానాలతో పాటు శివపూజా విధానాలు కూడా ఉంటాయి.
బ్రహ్మాది దేవతలు శివుణ్ణి స్తుతించిన స్తోత్రాలు, శివుని గురించి తపస్సు చేసిన భక్తుల, దేవతల విశేషాలు కనిపిస్తాయి. అలాగే దక్షమహాయజ్ఞలాంటి వాటి వివరాలు పూర్తిగా ఇందులో వర్ణితమయ్యాయి. శివుడు చంద్రుణ్ణి ధరించడానికి కారణం, సృష్టిలో ఉన్న ప్రకృతి మహిమ శివాభిషేకానికి, పూజకు పనికి వచ్చే పుష్పాలు, ద్రవ్యాలు, బిల్వవృక్ష ఆవిర్భావం గురించి ఈ పురాణంలో వివరంగా చదువుకోవచ్చు.
అంజనాదేవి చరిత్ర, వాలిసుగ్రీవులు. శివానుచరులైన నంది, భృంగి జన్మ విశేషాలు కనిపిస్తాయి. ఇక్కడే పరశురాముకి సంబంధించిన అనేక కథలుంటాయి. కార్తవీర్యార్జునుని ప్రస్తావన. జమదగ్ని - కార్తవీర్యార్జుని మధ్య వివాదం. రేణుకాదేవి విలాసం, పరశురాముడు శివానుగ్రహంతో పాశుపాతాస్త్రాన్ని పొందడం, పరశురాముడు, కార్తవీర్యుని మధ్య యుద్ధం, తదితర విశేషాలు ఉంటాయి.
ఇవే కాకుండా మోక్షానికి అనువైన సాధనాలు, దేవతల గురువైన బృహస్పతికి సంబంధించిన కథనాలు, వీటిలో దాగిన ఆధ్యాత్మిక విశేషాలు కనిపిస్తాయి. ఎన్నో శివపరమైన సూక్తులు తత్త్వచింతన రూపంలో దాగి ఉన్నాయి.
ఈ పురాణంలో ప్రస్తావితమైన పాత్రల సంభాషణలన్నీ జ్ఞాన నిధుల్లాంటివే. వాటన్నింటిలోనూ మోక్షసాధనకు కావలసిన సాధనా మార్గాలు దర్శనం ఇస్తాయి. ఇవి రుద్ర సంహితలోని దాక్షాయణి పరమశివుల సంభాషణలో ఎక్కువగా కనిపిస్తాయి. మోక్ష పరమైన మార్గాలెన్నో ఉన్నా వాటన్నింటిలోనూ నిశ్చలమైన, నిష్కల్మషమైన భక్తి ప్రధానమైనదని పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. శివమహా పురాణం కోటిరుద్రసంహితలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎప్పుడెప్పుడు ఎలా అవతరించాయో తెలియచేస్తుంది. వీటన్నింటనీ నిశితంగా పరిశీలిస్తే ఈశ్వరుడు ఎంత బోళాశంకరుడో, భక్తవత్సలుడో, నిర్మలమైన భక్తికి ఎంతగా పరవశుడై వశుడైపోతాడో తెలుస్తుంది.
Comments
Post a Comment