Pallikondeswara Swamy Temple: శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి వారి ఆలయం - సురుటుపల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సురుటుపల్లి అనే గ్రామంలోని పల్లి కొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో కనిపిస్తాడు. దేశంలో ఇటువంటి విగ్రహం ఇదొక్కటే ఉండడం విశేషం. శ్రీ మరగదాంబిక సమేత పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రంలో వెలసిన శివుని శయన భంగిమకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉన్నది. పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రం వెనుక పౌరాణిక గాథ ఉంది.

వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం, దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా, భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకూట విషాన్ని మింగి తన కంఠంలో దాచుకొన్నాడు. ఆ తరువాత శివుడు కైలాసానికి తిరిగి వెళ్లే సమయంలో సురుటుపల్లి ప్రాంతానికి వచ్చేసరికి కాలకూట విష ప్రభావం వలన కొన్ని క్షణాల పాటు ఒక రకమైన మైకాన్ని పొంది పార్వతి ఒడిలో తల పెట్టుకొని శయనించాడట.

దేవతల ఉపచారాలు

నారదుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు, మహర్షులు అక్కడకు హుటాహుటిన విచ్చేసి పరమేశ్వరుడికి ఉపచారాలు చేయసాగారు. దాంతో తేరుకున్న శివుడు దేవతలందరి కోరిక మేరకు ఇక్కడ శయన భంగిమలో కొలువు తీరాడు. గరళం శివుని కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహా విష్ణువు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయాడు. దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలి రంగులోకి మారింది. ఆనాటి నుంచి శివుడు గరళకంఠుడని, నీలకంఠుడని ప్రసిద్ధి చెందాడు.

నీలకంఠుడికి స్వస్థత చేకూర్చడం కోసం సురుటుపల్లికి తరలి వచ్చిన సురగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శన భాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్తరుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతోంది. సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సురుల పల్లి అనే పేరు వచ్చింది. కాల క్రమేణా వాడుకలో ఆ ప్రాంతం సురటు పల్లిగా మారింది. శయన భంగిమలో ఉన్న శివుడిని దర్శించుకొంటే అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటారు.

ఆలయ విశేషాలు

భక్తుల పాలిట కల్పతరువుగా భావించే పల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని 1344-47 మధ్య కాలంలో విజయనగరాధీశుడైన హరిహర బుక్కరాయలు నిర్మించారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేశారని ఆలయ గోడలపై శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ మేధా దక్షిణామూర్తిని ఆరాధిస్తే విశేషమైన విద్యా ప్రాప్తి కలుగుతుంది. ప్రదోష వేళలో శ్రీ నందీశ్వరుని ఆరాధనకూ ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.

అపురూపం శివుని శయన రూపం

దేశంలో కనివిని ఎరుగని రీతిలో పార్వతీదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని భక్త జనం ఎక్కడా చూసి ఉండరు. పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం అపురూపం. చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నులపండుగగా ఉంటుంది.

పరమశివుని దర్శనభాగ్యం

ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గుర్తించిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1979లో ఇక్కడ మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి పరవుశివుడు దర్శన భాగ్యం కలగడంతో ఆయన ఈ ఆలయంలోనే గడిపినట్లు స్వయంగా చెప్పారు.

ప్రదోష క్షేత్రం

అరుణా నది ఒడ్డున వెలసిన సురుటుపల్లి కొండేశ్వరస్వామి క్షేత్రంలో వెలసిన శయన శివుని ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్ష త్రయోదశి రోజు దర్శించుకోవడం విశేషంగా భావిస్తారు. ఒకవేళ ఈ త్రయోదశి, శనివారం కలిసి వచ్చిన రోజున మహాప్రదోష వేళలో దేవతలు కూడా పల్లి కొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆ రోజు దర్శనానికి వెళితే సమస్త దేవతల కరుణాకటాక్షాలను అందుకోవచ్చని భక్తుల నమ్మకం. శివుడు హాలాహలాన్ని మింగి సొమ్మసిల్లిన వేళ పదిహేనువేల మంది దేవతలు ఈ స్థలానికి వేంచేసినట్లు శివపురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, కృష్ణ పక్ష ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, నంజుండస్వామిగానూ భక్తులు స్తుతిస్తారు.

అభిషేకంతో అభీష్టసిద్ధి

ఈ ఆలయంలో శివునికి పంచామృతంతో అభిషేకం జరిపిస్తే ఆరోగ్య ప్రాప్తి. పాలతో అభిషేకం చేస్తే దీర్ఘాయు ప్రాప్తి. పెరుగుతో అభిషేకం చేస్తే సత్సంతాన ప్రాప్తి. గంధంతో అభిషేకం జరిపిస్తే లక్ష్మీకటాక్ష ప్రాప్తి కలుగుతాయని విశ్వాసం. అలాగే స్వామి దర్శనం చేతనే వివాహ యోగం కలుగుతుందని, వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో ఉంటుందని భక్తుల నమ్మకం.

ఎలా చేరుకోవచ్చు?

తిరుపతి నుండి 73 కిలోమీటర్లు చెన్నై వైపుగా, చెన్నై నుండి 68 కిలోమీటర్లు తిరుపతి వైపుగా ప్రయాణిస్తే చెన్నై–తిరుపతి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. 

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి