Karthika Puranam: కార్తీక పురాణం 20వ అధ్యాయము - అత్య్ర్యగస్త్య సంవాదము, పురంజయోపాఖ్యానము
జనకమహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్రా! సర్వపాపములను నశింపజేయు నదియు, సౌభాగ్యప్రదమగు కార్తిక మహాత్మ్యమును మరియు వినవలెననుకోరిక కలదు గాన చెప్పుము. వశిష్ఠమునిపల్కెను. రాజా! వినము. కార్తిక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని, అత్రిమహా మునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకర మయినది దానిని నీకు చెప్పెదను.
అత్రి మహాముని ఇట్లు పల్కెను. అగస్త్యమునీంద్రా! లోకత్రయోప కారము కొరకు కార్తిక మాహాత్మ్యబోధకరమైన హరికథను జెప్పెదను వినుము. అగస్త్యుడడిగెను. విష్ణ్వంశ సంభూతుడవైన యో అత్రిమునీశ్వరా! సద్ధర్మశ్రవణమున కార్తికమాసము కీర్తించబడినది. కార్తీకమాస ధర్మమును వినగోరితిని గాన చెప్పుము.
అత్రిముని ఇట్లు చెప్పెను. ఓఅగస్త్యమునీంద్రా ! బాగు బాగు. నీ ప్రశ్న పాపనాశ కరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి. చెప్పెదను వినుము. కార్తిక మాసముతో సమానమైన మాసములేదు. వేదముతో సమానమైన శాస్త్రములేదు. ఆరోగ్య ముతో సమానమైన ఉల్లాసములేదు. హరితో సమానమైన దేవుడులేడు. కార్తిక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును బొందును.
విష్ణుభక్తివలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్రవిజయము పొందుదురు. ఈ విషయ మును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధి పతియు, సూర్యవంశసంభూతుడు పురంజయుడను ఒకరాజు గలడు. ఆ పురంజయుడు కొద్దికాలము ధర్మమార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధినశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును, శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మ ణులతో ద్వేషించి లోభియును హింసకుడునునై బంగారమును దొంగిలించు వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడియుండెడివాడు.
రాజు యీ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంత రాజులు, కాంభోజ, కురురాజాదులు అనేకమంది సింహబలులతో గూడి గుఱ్ఱములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతోవచ్చి అయోధ్యాపట్టణము చుట్టును చెఱకు పానకమునకు తేనె టీగలవలె శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతు రంగబలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను.
పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో, ధ్వజముతో, స్వయంప్రకాశ మానమును, అనేక దిగ్విజయములను జేసినదియు, శస్త్రాస్త్ర పూరితమును, మహాచక్ర యుతమును, మంచి గుఱ్ఱములతో గూడినదియునైన సూర్యదత్తరథమునెక్కి గజ, రథ, తురగ, పదాతులనెడి, చతురంగబలముతో పురద్వారము నుండి శత్రుసైన్యములో ప్రవేశించి భేరీతూర్య నినాదములను, శంఖగోముఖనాదములను ధనుష్టంకారధ్వనులను ఒక్క మారుగా ఉఱుముల చప్పుడువలె ధ్వనిచేయించెను.
Comments
Post a Comment