Bhimavaram Mavulamma Temple: శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయం - భీమవరం
శ్రీ మావుళ్ళమ్మ తల్లి 800 సంవత్సరాల క్రితం అంటే క్రీ॥ ఈ 1200 సంవత్సరంలో వెలసినట్లు తెలుస్తోంది. అయితే శ్రీ అమ్మవారి దేవాలయానికి సంబంధించిన వివరాలలో క్రీ॥ తే॥ 1880 సం॥ నుండి మాత్రమే చరిత్ర లభ్యమౌతోంది.
స్థానికుల కథనం ప్రకారం భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లివారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరచటానికై నిర్మించిన భవన ప్రాంతంలో వేప, రావిచెట్లు కలిసి ఉన్నచోట్ల శ్రీ మావుళ్ళమ్మ వారు వెలిశారని తెలుస్తోంది. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభప్రదమైన మామిడి పేరు మీదుగా 'మామిళ్ళ అమ్మ'గా, అనంతరం 'మావుళ్ళమ్మ'గా రూపాంతరం చెందిందని విజ్ఞుల అభిప్రాయం. చిన్న చిన్న ఊళ్ళవారంతా కలిసి అమ్మవారిని గ్రామదేవతగా కొలుచుటచే 'మావుళ్ళ 'అమ్మ' కాస్తా 'మావూళ్లమ్మ'గా రూపాం తరం చెందిందని మరికొందరి అభిప్రాయం.
1880 సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరానికి చెందిన శ్రీ మారెళ్ల మాచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మ వారు కలలో సాక్షాత్కరించి తాను వెలసిన ప్రాంతం గురించి చెప్పి, ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించవలసినదిగా ఆదేశించా రని పూర్వీకుల కథనం. ఆ ప్రకారం వారు అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని వెతకగా, అమ్మవారి శిలావిగ్రహం కనిపించింది. వెంటనే అమ్మవారి విగ్రహానికి ఎండ తగలకుండా ఒక పూరిపాక వేసి పూజలు చేసి, ఆదివారం బజారు (పూర్వం ఐదులాంతర్ల స్తంభం) ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించారు.
1910 ప్రాంతంలో భీమవరాన్ని ముంచెత్తిన వరద తాకిడికి అమ్మవారి విగ్రహం చాలావరకు శిథిలమైంది. 1920 ప్రాంతంలో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి శ్రీ తాతవోలు నాగభూషణాచార్యులు ఎంతో కృషిచేసి, శ్రీ అమ్మవారి విగ్రహాన్ని, గర్భాలయానికి నిండుగా మలిచారు.
అయితే శ్రీ అమ్మవారు ప్రళయ భీకర స్వరూపిణిగా కనిపించడంతో గ్రంథినర్సన్న కుమారుడు శ్రీ అప్పారావు, విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్ది, ద్వారపాలక కన్యలను మలిచి శ్రీ అమ్మవారి ఆలయానికి మరింత శోభ చేకూర్చారు. తొలినుండి మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి భీమరాజు వంశస్తులైన వారి పూర్వీకులు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటివారుగాను, గ్రంథి అప్పన్న మొదలైన వారి పూర్వీకులు అత్తింటివారుగాను శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల్లో ప్రాధాన్యత వహిస్తున్నారు.
ప్రతీ ఏటా జ్యేష్ఠ శుద్ధ పాద్యమి నుంచి నెలరోజుల పాటు శ్రీ అమ్మవారికి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రతి సంవత్సరం పుష్యమాసంలో శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ఉగాది వేడుకలు, జ్యేష్ఠమాస అమ్మ వారి జాతర, ఆషాఢ పూర్ణిమ నాడు శ్రీ అమ్మవారి శాకంబరీ అలంకారం, ఆశ్వయుజ మాసంలో శ్రీదేవీ శరన్నవరాత్రులు అతి వైభవంగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన, లక్ష కుంకుమార్చన, ప్రతి పౌర్ణమి రోజున చండీహోమం జరుగుతాయి. ప్రతి మంగళవారం లలితా సహస్ర నామ పారాయణం, ప్రతి స్థిరవారం విష్ణుసహస్ర నామ పారాయణం జరుగుతాయి.
Comments
Post a Comment